వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య గొడవలవుతుంటాయి. ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. దానికోసం హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని కృష్ణ మురళి) ని సంప్రదిస్తారు. 99 జంటలను విడగొట్టిన ఆయన 100వ జంట వీరిని విడగొట్టి గిన్నీస్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో హరిశ్చంద్ర ప్రసాద్ మరణిస్తాడు. అతను చేసిన పాపాలకు ఆత్మగా మారి భూలోకంలో తిరుగుతుంటాడు. ఈ టైంలో దేవుడు అతనికి ఓ టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ లో వరుణ్ శరీరంలోకి పల్లవి ఆత్మ, పల్లవి శరీరంలోకి వరుణ్ ఆత్మ వెళ్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ జంబలకిడి పంబ కథ.
వరుణ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి బాగానే చేశాడు. ముఖ్యంగా అమ్మాయి పాత్రలో శ్రీనివాస్ రెడ్డి నటన బాగుంది. ఇక సిద్ధి ఇద్నాని మొదటి సినిమానే అయినా బాగానే చేసింది. వెన్నెల కిశోర్ పాత్ర కూడా నవ్వులు తెప్పిస్తుంది. పోసాని కూడా తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గానే ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ పర్వాలేదు. మురళికృష్ణ కథ ఆకట్టుకునేలా అనిపించినా కథనం అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి.