బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తో కలిసి మరోసారి నటించాలని ఉన్దని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మనసులో మాట బయట పెట్టాడు. ఐదేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి నటించిన "జంజీర్" సినిమా (తెలుగులో తుఫాన్) బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నానని, కానీ ఫలితం తనని నిరాశ పరిచిందని ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ వెల్లడించాడు.
అయితే, మరోసారి అవకాశం దక్కితే, ప్రియాంక చోప్రా తో కలిసి నటిస్తానని మెగా పవర్ స్టార్ చెప్పుకొచ్చాడు. "బాలీవుడ్లో అది నాకు తొలి చిత్రం. కాబట్టి, చాలా కష్ట పడ్డాను. కానీ, ఫలితం నిరాశ పరిచింది. అయితే, బాలీవుడ్ లో ప్రయత్నాలు మాత్రం మానుకోను. మంచి కథ దొరికితే, మరోసారి బాలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ. అలానే ప్రియాంక చోప్రా తో కూడా నటించేందుకు రడీ. ఆమె చాలా అందమైన, ప్రతిభ ఉన్న నటి" అని రామ్ చరణ్ వెల్లడించాడు.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో చేస్తున్నారు, మీరు కూడా ఆ వైపు వెళ్లే ఆలోచనలు ఏవైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా, "హాలీవుడ్ ఆలోచనలైతే ప్రస్తుతానికి లేవు. తెలుగు ఇండస్ట్రీ లో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నాకు నప్పే కథల తోనే ప్రయాణం సాగిస్తా" అని ఈ మెగా హీరో స్పష్టం చేశాడు.