బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం `మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా నుంచి వరుసగా పోస్టర్స్ వదులుతున్నారు. కొంతవరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ప్రస్తుతం కంగనాయే దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. దర్శకత్వ బాధ్యతలు ఆమెనే స్వీకరించడంతో, ఈ ప్రాజెక్టుపై మరింతగా ఆసక్తి పెరిగింది.
షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాకు సంబంధించి పలు వివాదాలు బయటకు వచ్చాయి. దర్శకుడు క్రిష్కు, కంగనకు మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే సినిమా నుంచి క్రిష్ అర్థంతరంగా వైదొలిగారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నటుడు సోనూసూద్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో సోనూసూద్, కంగన బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు.
ఇక క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్కు కంగననే దర్శకత్వం వహించింది. దాదాపు 45 రోజుల పాటు కంగన దర్శకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. అయితే అంత గొప్ప చారిత్రాత్మక సినిమా కంగనా ఎలా డీల్ చేయగలుగుతోందో అని రక రకాల చర్చలు జరుగుతున్నాయి. అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆ టీజర్ లో తన పేరును దర్శకురాలిగా, లేదా సహాయ దర్శకురాలిగా వెయ్యొద్దని కంగన చిత్రయూనిట్కు సూచించిందట. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.