అనంతపురం టిడిపిలో ముసలం తప్పదా ? పోయిన ఎన్నికల ఫలితాలకు వచ్చే ఎన్నికల్లో రివర్స్ ఫలితాలు తప్పవా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం వస్తోంది. అనంతపురం సిట్టింగ్ ఎంపి జెసి దివాకర్ రెడ్డి వ్యవహార శైలే అందుకు ప్రధాన కారణం. మామూలుగానే జెసితో ఎవరికీ ఎక్కువ కాలం పొసగదు. ఎందుకంటే, ఎక్కడుంటే అక్కడ ప్రతీ విషయంలోనూ తన మాటే చెల్లుబాటవ్వాలనే మనస్తత్వం ఉన్న జెసితో సహజంగానే ఎవరికీ పడదు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం కాబట్టి సరిపోయింది. కానీ టిడిపి అలాకాదు. ఇపుడదే పార్టీలో సమస్యగా మారింది. కాకపోతే ఎన్నికలకు ముందు ఇటువంటి సమస్యలు పెద్దవైపోయి నేతలు రోడ్డున పడుతుండటమే చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యగా మారుతోంది. జెసి వ్యవహారశైలి నచ్చని పలువురు నేతలతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలు కూడా తిరుగుబాటు లేవదీస్తున్నట్లే కనబడుతోంది.
ఎక్కువైపోతున్న జెసి ఆధిపత్యం
ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాలోనే ఉన్న ముగ్గురు టిడిపి ఎంఎల్ఏలతో జెసికి ఏమాత్రం పడటం లేదు. పైన చెప్పుకున్నట్లుగానే జెసి ఆధిపత్యాన్ని వారు భరించలేకున్నారు. మొన్నటి వరకూ ఏదోలా నెట్టుకొచ్చిన ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో కూడా జెసి జోక్యం పెరిగిపోవటాన్ని జీర్ణించుకోలేకున్నారు. అందుకే ఒకరకంగా జెసిపై తిరుగుబాటు లేవదీస్తున్నారు. జిల్లాలోని అనంతపురం, రాయదుర్గం, శింగనమల, కదిరి, గుంతకల్లు, కల్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం జెసి ప్రయత్నిస్తున్నారు. పై నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు పోటీగా తన మనుషులను దింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పించుకునేందుకు జెసి ప్రయత్నాలు మొదలుపెట్టటంతో ఎంఎల్ఏలందరూ పార్టీలో తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు దిక్కు తోచటం లేదు.
అందరినీ కెలికేస్తున్న జెసి
అనంతపురంలో సిట్టింగ్ ఎంఎల్ఏకి పోటీగా వైసిపిలో నుండి గుర్నాధరెడ్డిని తెచ్చారు. గుంతకల్లులో ఎంఎల్ఏ జితేంద్రగౌడ్ కు పోటీగా మధుసూధనగుప్తాను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు నియోజకవర్గం రాయదుర్గంలో మేనల్లుడు, ఎంఎల్సీ దీపక్ రెడ్డిని తెచ్చారు. అలాగే, శింగనమల, కల్యాణదుర్గం, కదిరి నియోజకవర్గాల్లో కూడా ఎంఎల్ఏలకు పోటీగా నేతలను పట్టుకొచ్చారు. దాంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలులో ఎక్కడ చూసినా ఆయోమయం నెలకొంది. పుట్టపర్తి ఎంఎల్ఏ, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డికి వ్యతిరేకంగా తన పిఏని దింపారు. దాంతో పై నియోజకవర్గాల్లో అభద్రత చోటుచేసుకుంది. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను టిడిపి 12 గెలుచుకున్నది. వచ్చే ఎన్నికల్లో ఈ ఫిగర్ రివర్స్ అవుతుందేమో అన్న ఆందోళణ నేతల్లో ఎక్కువైపోతోంది.
రాజీనామాలతో హెచ్చరికలు
తమకు పోటీగా తమకు తెలీకుండా ఎవరినైనా పార్టీలోకి చేర్చుకుంటే వెంటనే రాజీనామాలు చేస్తామంటూ అనంతపురం, గుంతకల్లు ఎంఎల్ఏలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్ హెచ్చరించారు. వీళ్ళ పంచాయితీ చివరకు చంద్రబాబు ముందుకు చేరింది. అదే సమయంలో కాల్వ కూడా జెసి పై సిఎంతో ఫిర్యాదు చేయటంతో విషయం సీరియస్ అయ్యింది. దాంతో జిల్లాలో అసలు ఏం జరుగుతోందో తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ సీనియర్ నేత టిడి జనార్ధన్ ను చంద్రబాబు ఆదేశించారు. పద్దతి మార్చుకునే వ్యక్తికాదు జెసి. జెసి ఆధిపత్యాన్ని భరించలేకున్నారు ఎంఎల్ఏలు. దాంతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి దారుణమైన ఫలితాలు తప్పవని ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన పడుఉన్నారు. చంద్రబాబు ఈ పంచాయితీని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే ?