చంద్రబాబునాయుడుకి వదినమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి భరోసా ఇచ్చేశారు. ఇంతకీ ఏ విషయంలో తెలుసా ? అదేనండి సిబిఐ విచారణ విషయంలోనే లేండి. చంద్రబాబుపై సిబిఐ విచారణ జరిపించటం తమ పార్టీకి ఇష్టం లేదని చెప్పారు. ఇంతకాలం తన పాలనలో అవినీతి జరుగుతోందనే ఆరోపణలపై కేంద్రప్రభుత్వం సిబిఐ విచారణ చేయించబోతోందంటే చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక విధంగా ఆ ప్రచారంతో చంద్రబాబులో ఆందోళన బాగా పెరిగిపోయిందన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఎటువంటి విచారణ ఉండదంటూ పురంధేశ్వరి చెప్పారు లేండి. అదే సమయంలో చంద్రబాబు అవినీతిపై సిబిఐ లాంటి సంస్ధలకు ఫిర్యాదులు చేస్తామంటూ ఎంఎల్సీ సోము వీర్రాజు చెబుతుండటం గమనార్హం.
చంద్రబాబుకు సంతోషమేనా ?
ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి నేత, వదినమ్మ పురంధేశ్వరి ఇచ్చిన అభయం చంద్రబాబుకు సంతోషం కలిగించేదే. ఒకవైపు విచారణపై హామీలిస్తూనే మరోవైపు కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు లెక్కలు చెప్పటం లేదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చిన రూ. 1600 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కలడుగుతుంటే చంద్రబాబు చెప్పటం లేదంటూ ధ్వజమెత్తారు.
నిధులకు లెక్కలు చెప్పాల్సిందే
పనిలో పనిగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదని ఆరోపించటం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఎన్డీఏ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిధులు మంజూరు చేస్తుంది ? ఇక, కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర విభజన జరిగే సమయానికి ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఆగిపోయిన విషయం పురంధేశ్వరికి ఆమాత్రం తెలీదా ? పైగా అప్పట్లో పురంధేశ్వరి కేంద్రమంత్రే కదా ? యుటిలిటీ సర్టిపికేట్లు ఇవ్వకుండా కేంద్రం మళ్ళి నిధులు ఎలా ఇస్తుందంటూ నిలదీయటం గమనార్హం. అంటే పురంధేశ్వరి చెప్పేదాని ప్రకారం ఇప్పట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాదని స్పష్టమైపోతోంది. కక్షలతో సిబిఐ దాడులు చేయించే సంస్కృతి బిజెపిది కాదంటూ పురంధేశ్వరి చెప్పటం గమనార్హం.