నిజంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్
బాధేంటో అర్ధం కావటం లేదు. రాజకీయాల్లో శతృవుకు శతృవు మిత్రుడు అన్న నానుడి
సహజంగానే ఉంటుంది. బలమైన నేతను వ్యతిరేకించే వారంతా ప్రత్యర్ధుల్లో ఎవరైతే బలంగా
ఉన్నారని అనుకుంటారో వారికి మద్దతుగా నిలవటం రాజకీయాల్లో చాలా సహజం. ఆ మాటకొస్తే
ఇదే సూత్రం ఏ రంగానికైనా వర్తిస్తుంది కానీ రాజకీయాల్లో అయితే బహిరంగంగానే
తెలిసిపోతుంది. ఇంతకీ పవన్ బాధేమిటంటే చంద్రబాబు మీదున్న వ్యతిరేకతతోనే ,
చంద్రబాబుపై కక్షసాధింపుతోనే టిఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తున్నట్లు
చెప్పారు. ఇక్కడే పవన్ బాధేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు-జగన్-పవన్ రాజకీయంగా ఇఫ్పటికైతే ప్రత్యర్ధులనే అనుకోవాలి. సరే, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందే చెప్పుకున్నట్లు ముగ్గురు ప్రత్యర్ధుల్లో ఎవరికి వారుగా తమకు అవకాశం ఉన్నంతలో ఇతరుల నుండి మద్దతు సంపాదించుకోవటానికే ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే చంద్రబాబు కాంగ్రెస్ తో తెలంగాణాలో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణాలో బెడిసికొట్టేటప్పటికి ఆంధ్రాప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై ఆలోచిస్తున్నారు.
ఇక, పవన్ కల్యాణ్ కూడా వామపక్షాలతో పొత్తులు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. వామపక్షాలతో పవన్ ఎందుకు పొత్తులు పెట్టుకున్నట్లు ? నాలుగు ఓట్లో లేకపోతే నాలుగు సీట్లో సంపాదించుకోవాలనే కదా ? మరి ఎవరి పొత్తులను వాళ్ళు చూసుకుని ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నపుడు జగన్ మాత్రం అదే పని ఎందుకు చేయకూడదు ? పైగా తాను ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకునేది లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే చెబుతున్నారు. ఈ పరిస్ధితుల్లో ఎవరైనా వచ్చి మద్దతు ఇస్తానంటే జగన్ తీసుకోవటంలో తప్పేమీ లేదే ? కాబట్టే చంద్రబాబునాయుడును వ్యతిరేకించే టిఆర్ఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలనుకోవటం చాలా సహజం. అందులో తప్పేముందో అర్ధం కావటం లేదు.
పోయిన ఎన్నికల్లో బిజెపి, పవన్, చంద్రబాబు కలిసే పోటీ చేశారు. మూడు పార్టీలు కలిసింది జగన్ కు వ్యతిరేకంగానే కదా ? పైగా రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చిన కాంగ్రెస్ కు, అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి కానీకుండా అడ్డుకునేందుకే తాను చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు పవన్ బహిరంగంగానే చెప్పారు. మరి అదే పద్దతిలో చంద్రబాబు మీద వ్యతరేకతతోనే టిఆర్ఎస్ జగన్ కు మద్దతిస్తే పవన్ కొచ్చిన బాధేంటి ?
అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబే సిఎం కావాలని పవన్ కోరుకుంటున్నారా ? చూడబోతే జగన్ చెబుతున్నట్లుగా చంద్రబాబు, పవన్ విడిపోయినట్లు నాటకాలాడుతున్నారా ? అందుకనే కదా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, బిజెపి, పవన్ కలిసి జనాలను మోసం చేశారంటున్నది. కాబట్టి ఇపుడు తాము విడిపోయినట్లు నాటకాలాడుతూ జనాలను మళ్ళీ మోసం చేస్తున్నారు అనటంలో తప్పేమీ లేదనే అనిపిస్తోంది. నిజంగానే పవన్ బద్ధశతృవైతే చంద్రబాబును ఓడించటానికి వీలైనన్ని దారులు వెతకాలి కానీ జగన్ మీద పడి ఏడుస్తున్నారంటే అర్ధమేంటి ?