ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సరైన బస్సు సౌకర్యం లేక రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. అయితే అటు కార్మికులు కూడా తమ డిమాండ్లపై ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్ని అద్దె ప్రైవేటు బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు అందరూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. చార్జీలు భారీగా పెంచి అందినకాడికి దోచుకుంటున్నారు.
వాహనదారులు పెంచేసిన అధిక చార్జీలు కు భయపడి ప్రభుత్వం నడుపుతున్న అద్దె ప్రైవేటు బస్సుల లోనే ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిప్పుతున్న ప్రైవేటు అద్దె బస్సుల లో కూడా తాత్కాలిక కండక్టర్లు ప్రజల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు ఆరోపించారు. ప్రైవేట్ వాహనదారుల కంటే ఎక్కువగా ప్రభుత్వం తిప్పుతున్న బస్సుల్లో కండక్టర్లు చార్జీలు వసూలు చేస్తున్నారని... ఇదేమిటని ప్రశ్నిస్తే డిపో మేనేజర్లు మాకు అలాగే వసూలు చేయమని చెప్పారని చెబుతున్నారని ఇప్పటికే ఎంతో మంది ప్రయాణికులు తెలిపారు.
అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది. ప్రభుత్వం తిప్పుతున్న ప్రైవేటు బస్సులో కండక్టర్ లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విషయం తమ దృష్టికి వచ్చిందని... ఆర్టీసీ బస్సులో చార్జీలపై దృష్టి పెడుతున్నమని టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. కండక్టరు టికెట్ కంటే ఒక రూపాయి ఎక్కువ అడిగిన ప్రయాణికులు కూడా ఇవ్వవద్దని సూచించారు.