ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తన భార్య కొణిదెల సురేఖతో కలిసి ముందుగా అమరావతికి చేరుకున్న చిరు జగన్ను కలిసే ముందు సోదరుడు పవన్కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ నివాసంలో జగన్ దంపతులు చిరు దంపతులకు ఘనస్వాగతం పలికారు. ముందుగా లంచ్ అనంతరం గంట పాటు వీరిద్దరు ప్రత్యేకంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
వీరి భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ప్రధానంగా బయటకు రాకపోయినా
సైరా సినిమాతో పాటు రాజకీయ పరమైన అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి దంపతులు జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడంతో పాటు శాలువా కప్పి చిరు సత్కారం చేశారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు.
లంచ్ తర్వాత గంట పాటు వీరిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయంటున్నారు. ఇక లంచ్ టైంలోనే జగన్ సొంత ప్రాంతమైన రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై చిరు తీసిన
సైరా సినిమా గురించి చిరు జగన్కు వివరించారట. నరసింహారెడ్డి జీవిత చరిత్రపై అప్పటికే జగన్కు ఓ ఐడియా ఉన్నా కొన్ని తెలియని విషయాలను చిరు చెప్పి ఉండవచ్చంటున్నారు. ఇక జగన్ కూడా రెండు మూడు రోజుల్లో విజయవాడలోని పీవీపీ మాల్లో
సైరా సినిమాను చూడనున్నారట.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఒకటీ, ఆరా మాటలు కూడా వీరు మాట్లాడుకున్నప్పటకి రాజకీయ పరమైన అంశాలకుల జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చిరు సీఎం జగన్ ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ వినోదపు పన్ను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.