కరోనా చైనాలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. అయితే అది చైనాను దాటి ప్రపంచం మొత్తం వ్యాపించే వరకూ అంతా ఏం చేస్తున్నారు. దేశాలన్నీ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నారు. మందు లేదని తెలిసీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం.. అతడు ఆడిన అబద్దం. ఆ ఒక్క అబద్దం ప్రపంచాన్ని ఇప్పుడు వల్లకాడుగా మారుస్తోంది.
ఇంతకీ ఎవరతడు.. అతడు ఆడిన అబద్దం ఏంటి..? అతడే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయస్. ఆయన ఏం అబద్దం ఆడాడంటే... కరోనా వైరస్ ‘మనిషి నుంచి మనిషికి’ వ్యాపించదని ప్రకటించాడు. వాస్తవానికి ఇది చైనా మాట. దాన్నే టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓ వేదికపై నుంచి చెప్పేశాడు. ఇప్పుడు ఆ పెద్ద అబద్ధం మానవ జాతి ఆరోగ్యాన్నే పెద్ద ప్రమాదంలో పడేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయస్ నిర్లక్ష్యమే ప్రపంచాన్ని ఇప్పుడు నాశనం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో గత మూడు నెలలుగా సరైన రీతిలో వ్యవహరించలేదు. చైనాలోని ఉహాన్లో డిసెంబర్ మధ్యలోనే కరోనా వైరస్ బయటపడింది. అక్కడి నుంచి థాయ్లాండ్, తైవాన్, దక్షిణకొరియా తదితర దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే అంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతగా అధనామ్ ప్రారంభంలోనే తగిన చర్యలు తీసుకోలేదు.
దీనికి తోడు చైనా మొదటి నుంచి కరోనా విషయంలో వాస్తవాలన్నీ దాచిపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతగా అధనామ్ వైఫల్యమే ఈనాటి దుస్థితి కారణంగా చెప్పొచ్చు. ఈ ఆధునిక కాలంలోనూ ఒక వ్యాధితో ప్రపంచం వ్యాప్తంగా లక్షన్నర మంది చనిపోవడం అక్షరాలా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతగా అధనామ్ వైఫల్యమే.