అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేస్తూ సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు తన అధికారాలకు మరింత పదును పెడుతూ దూకుడు నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సంఘం చెబుతున్న మాటలను వినకుండా వ్యవహరిస్తున్న అధికారులపై వేట వేసేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా అలాంటి అధికారుల జాబితాను సిద్దం చేసి వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘంలో సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తాజాగా తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

ఆమెను తొలగిస్తున్నట్టు సీఎస్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని, ఈ కారణంగా ఆమెను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాణీ మోహన్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న జీవీ సాయి ప్రసాద్‍పై కూడా ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జీవీ సాయి ప్రసాద్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారని, అంతేకాకుండా ఇతర ఉద్యోగులను కూడా తన విధంగానే సెలవుపై వెళ్లిపోవాలంటూ వారిని ప్రభావితం చేసినట్టు ఎస్ఈసీ చెబుతున్నారు.

ఇటువంటి చర్యలను క్రమశిక్షణా రాహిత్యంగా ఎన్నికల సంఘం పరిగణించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ చర్యలు విఘాతం కలిగించేలా విధంగా ఉన్నాయంటూ తేల్చిన ఎస్ఈసీ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. కాగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఆయన పదవి పూర్తి అయ్యేలోపు ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: