తమ పార్టీ ప్లీనరీ జరుపుకుంటున్న నేపథ్యంలో మీడియా వారిని కూడా ఎంత ఎక్కువ ప్రసన్నం చేసుకుంటే.. అంత బాగుంటుందని అనుకుంటున్నారేమో.. విందులు గట్రా వ్యవహారాలు తెలంగాణ సర్కారు పెద్దలు ముమ్మరంగా నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సెక్రటేరియేట్లో మీడియా వారికోసం ప్రత్యేకంగా తొలిసారిగా విందును ఏర్పాటు చేశారు. కాకపోతే.. ప్రభుత్వంలోని అసలు సిసలు పెద్దలు కాకుండా.. మంత్రి ఈటెల రాజేందర్ ఈ విందు ఏర్పాటు చేయడం విశేషం.
అసలే ప్లీనరీ పుణ్యమాన్ని తెలంగాణ సెక్రటేరియేట్ కొన్ని రోజులుగా బోసిపోయి కనిపిస్తోంది. గురువారం నాడు కూడా ముఖ్యమంత్రి సహా చాలా మంది ముఖ్యులు సెక్రటేరియేట్కు డుమ్మా కొట్టారు. కాకపోతే... ఈటెల రాజేందర్ మాత్రం.. ‘ఫాలోడ్ బై లంచ్’ అంటూ ఓ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెక్రటేరియేట్లో ఇలాంటి విందు ప్రెస్మీట్ జరగడం ఇదే తొలిసారి. దాంతో మీడియా తాకిడి కూడా ఎక్కువగానే ఉండగా.. పార్యడైజ్ నుంచి తెప్పించిన బిర్యానీలను అందరికీ వడ్డించారు.
అయితే ఈ సందర్భంగా బర్డ్ఫ్లూ మరియు కోళ్ల వ్యాపారానికి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ఈటెల రాజేందర్ కూడా చాలా పెద్దఎత్తున ఉన్న పౌల్ట్రీ ఫారాలకు యజమాని. బర్డ్ఫ్లూ పుణ్యమాని ఆయన వ్యాపారానికి కూడా పెద్ద దెబ్బే పడిరది. కాకపోతే.. గురువారం మధ్యాహ్నం లంచ్లో కూడా తక్కువ మంది మాత్రమే చికెన్ బిర్యానీ తిన్నారు. ఈ సందర్భంగా.. బర్డ్ఫ్లూ ఫారాల్లోని కోళ్లను చంపేయడం గురించి ప్రస్తావన వచ్చింది. ఈటెల మాట్లాడుతూ.. ‘అది నాకు అన్నం పెట్టిందయ్యా’ అంటూ కోళ్ల పరిశ్రమ గురించి చెప్పుకున్నారు.
అయితే ఈ ఒక్క డిన్నర్ మీటింగ్ పుణ్యమాని మీడియా వారిలో ఈటెలకు మంచి పేరు వచ్చింది. పెద్దపెద్దోళ్లంతా.. ఎప్పుడూ ప్రెస్మీట్లు మాత్రమే పెడుతుంటారని.. ఈటెల చిన్నస్థాయి నుంచి వచ్చిన వాడు.. బీసీ మంత్రి కావడం వల్లనే పేదోళ్ల కష్టసుఖాలు తెలుసు గనుక.. లంచ్ కూడా ఏర్పాటు చేశాడని పలువురు వ్యాఖ్యానించారు.