ఈ క్రమంలోనే సీట్లు పంపకాలు విషయంలో కూడా చర్చలు కూడా నడిచిపోతున్నాయని తెలుస్తోంది. పొత్తు లేకపోతే సీట్ల విషయంలో ఎలాంటి రచ్చ ఉండదు...కానీ పొత్తు ఉంటే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరగాలి. ముఖ్యంగా టిడిపి నేతలు ఎక్కువ త్యాగాలు చేయాలి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో టిడిపికి నాయకులు ఉన్నారు.
ఇదే క్రమంలో కీలకంగా ఉన్న విశాఖపట్నంలో కూడా టిడిపి నేతలు త్యాగాలు చేయక తప్పదు. ఒకవేళ పొత్తు లేకపోతే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు...పొత్తు ఉంటే విశాఖలో జనసేన ఏ సీట్లు కావాలని కోరుకుంటుందో చూడాలి. అయితే 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టిడిపి....బిజేపికి విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఇచ్చేసింది. అక్కడ బిజేపి గెలిచింది కూడా. ఒకవేళ ఇప్పుడు జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటు ఆ పార్టీకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. విశాఖ జనసేనకు ఇస్తే బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ త్యాగం చేయాల్సిందే. ఎందుకంటే గత ఎన్నికల్లో భరత్...విశాఖ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఈ సారి కూడా అక్కడే బరిలో దిగాలని చూస్తున్నారు.
ఒకవేళ జనసేనకు సీటు ఇవ్వకపోతే బాలయ్య చిన్నల్లుడుకు ఇబ్బంది లేదు. కానీ ఇస్తే భరత్కు వేరే సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాగో విశాఖ సౌత్ సీటు ఖాళీగానే ఉంది. ఆ సీటుని భరత్కు ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరి చూడాలి నెక్స్ట్ పొత్తుల పాలిటిక్స్లో ఏం జరుగుతుందో?