రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ తన పెద్ద పాప కోసం హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సింధు శర్మ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు రిషికతో పాటు ఆమె తల్లిదండ్రులు సింధుశర్మ, వశిష్టలను కోర్టు ఎదుట హాజరు పరచాలని హైదరాబాద్ మధ్య మండలం డీసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇక అత్తామామలు, భర్త నుంచి తన పిల్లలను తీసుకునేందుకు సింధు శర్మ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు చిన్న పాపను అప్పగించారు అత్తింటివారు. గత రెండు రోజులుగా రామ్మోహన్రావు ఇంటి బయట సింధు శర్మ ధర్నా చేశారు. ఆమె ధర్నాకు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి.
దీంతో చిన్నపాప శ్రీవిద్యను తల్లి సింధుశర్మకు పోలీసులు అప్పగించారు. పెద్ద కుమార్తె రిషిక ఇవ్వడానికి సోమవారం నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడున్నరేళ్ల పెద్ద కుమార్తెను కూడా అప్పగించే వరకూ తన పోరాటం ఆగదంటూ చెప్పిన సింధుశర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.