ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఎవ్వరూ ఊహించని విధంగా ఘోరంగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. పార్టీ అధ్యక్షుడి హోదాలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్కళ్యాణ్ రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. తన సొంత జిల్లా అయిన భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసినా రెండు చోట్లా పవన్కు గెలిచే యోగ్యం దక్కలేదు. దీంతో పార్టీ అధ్యక్షుడి హోదాలో కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లే అవకాశం పవన్కు లేకుండా పోయింది. ఇక పవన్ పార్టీ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి ఒక్క రాపాక వరప్రసాదరావు మాత్రమే విజయం సాధించారు.
ఇక ఇదిలా ఉంటే ఏరికోరి మరీ అన్నయ్య నాగబాబుకు సీటిచ్చారు పవన్. తాను పోటీచేసిన భీమవరం సెగ్మెంట్ ఉన్న నరసాపురం లోక్సభ సీటు నుంచి పోటీ చేసిన నాగబాబు కూడా ఘోరమైన ఓటమే మూట్టుకకోవాల్సి వచ్చింది. నాగబాబుకు నరసాపురంలో మూడో స్థానం మాత్రమే దక్కింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే టాక్ బయటకు పొక్కింది. మరి ఇందులో వాస్తవ ,అవాస్తవాలు ఎలా ఉన్నా ఇండస్ట్రీ అవుట్ సర్కిల్స్లో వినపడుతోన్న టాక్ ప్రకారం వీరి మధ్య గ్యాప్నకు కారణం జబర్దస్త్ అట.
నాగబాబుకు ఇటీవల కాస్తో కూస్తో ఈ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే పేరు వచ్చింది. ఈ ఎన్నికల్లో రోజా, నాగబాబు ఇద్దరూ పోటీ చేయడంతో జబర్దస్త్ను టెంపరరీగా ఆలీ, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లతో నడిపించారు. ఇప్పుడు పాత జడ్జిలే వచ్చే వారం నుంచి రానున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే రోజా రీఎంట్రీ ఇవ్వగా.. తాజాగా నాగబాబు కూడా షూటింగ్ కి వచ్చేశారు. ఇప్పుడు ఇదే అంశం మెగా సోదరుల మధ్య గ్యాప్నకు కారణమైందట. తాను సినిమాలు వదిలేసి పూర్తి స్థాయిలో పాలిటిక్స్లో కొనసాగుతానని.. మీరు కూడా అలాగే అవ్వాలని పవన్ నాగబాబుపై ఒత్తిడి చేశారట.
నాగబాబు మాత్రం తనకు డబ్బు, పాపులారిటీ తెచ్చిపెడుతున్న జబర్దస్త్ వదులుకోవడానికి ఇష్టపడలేదట. అదే టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనను నమ్ముకున్నా ఒరిగేదేం లేదన్నది నాగబాబుకు కూడా అర్ధమైపోయింది. అందుకే ఆయన మళ్లీ హాయీగా జబర్దస్త్ చేసుకునేందుకు వెళ్లిపోయారు. ఇదే పవన్కు నచ్చలేదని తెలుస్తోంది. తాను జబర్దస్త్ చేసుకున్నా రాజకీయాలు వదలనని చెప్పేందుకే జనసేన సమీక్షలకు కూడా వెళుతున్నారు.