కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఏపీ సీఎం జగన్ మెత్తగానే చురకలు వేశారు. ప్రత్యేకించి నిబంధనల ఉల్లంఘనలపై ఇన్నాళ్లు చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు సుతిమెత్తగా అధికారుల తీరును నిరసించారు. కాల్ మనీ, కరకట్ట భవనాలు వంటి అంశాలపై ఇన్నాళ్లు మనమంతా కళ్ళు మూసుకున్నా మా అంటూ ప్రశ్నించారు.
ప్రజలను చక్కటి మార్గంలో నడిపించాల్సిన మనమే అక్రమాలు చేస్తూ పోతే ఎలాగ అని నిలదీశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించడాన్ని ఎలా అనుమతి ఇచ్చారని అధికారులు ప్రశ్నించారు. కాల్ మనీ వ్యవహారంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు.
ఇలాంటి దారుణ విషయంపై పోలీసుల తీసుకున్న చర్యలు సున్నా అంటూ చురకలు వేశారు. అందుకే మార్పు మనతోనే మొదలు కావాలని ప్రజా వేదిక భవనాన్ని కూల్చి వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అక్రమాలపై చర్య తీసుకునే విషయంలో అధికారులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జగన్ గుర్తు చేశారు.
మన వ్యవస్థ లో ఇన్ని లోపాలు పెట్టుకొని దేశంలో నెంబర్ వన్ టూ చెప్పుకోవడం ఎలా సమంజసమని జగన్ ప్రశ్నించారు. ఇదేనా సుపరిపాలన అంటూ నిలదీశారు. మొత్తం మీద పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలని జగన్ అధికారులను కోరారు.