వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల నేతలను లాగేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఎన్నికల్లో ఘోరపరాజయంతో కోలుకోలేని దెబ్బతిన్న టీడీపీని మరింత దెబ్బకొట్టి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉండాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుంది. తాజాగా.. ఇదే బాటలో మరో కీలక నేత రాయపాటి సాంబశివరావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాయపాటి కమలం గూటికి చేరడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ.. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంది. అదేమిటంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. అంత సులభంగా రాయపాటిని రానిస్తారా..? అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉండేది. మూడు దశాబ్దాల రాజకీయంలో వీరు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండలేదు. సందర్భం ఉన్నా.. లేకున్నా.. ఎప్పుడు కూడా ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలతో తమ ప్రత్యేకతను చాటుకునేవారు. ఇక తారాచౌదరి ఎపిసోడ్తో అది తారా స్థాయికి చేరింది. తారా చౌదరి వద్ద పలువురు కీలక నేతల ఆడియో, వీడియో టేపులు ఉన్నాయంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇందులో కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపించింది. అది ఎటూ తేలకపోవడంతో అది అక్కడికే క్లోజ్ అయింది.
కన్నాను ఇరికించేందుకు తారా చౌదరికి రాయపాటి పెద్దమొత్తంలో డబ్బు కూడా ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. తనను ఇరికించేందుకు కొందరు ప్రయత్నా చేశారంటూ అప్పట్లో కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఎంపీగా ఉన్న తనను కలవడానికి ఎంతో మంది వస్తుంటారని.. అందులో భాగంగానే తారా చౌదరి కలిశారని.. అంతకుమించి ఏమీ లేదని రాయపాటి సెలవిచ్చారు.ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి... ఆ తర్వాత ఈ ఎన్నికలకు ముందు . కన్నా బీజేపీలో చేరి.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
2014 ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివరావు మాత్రం టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ అవినీతికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను బీజేపీలో చేరడమే అన్నింటికీ మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాయపాటి వస్తానంటే.. కన్నా రాణిస్తారా..? అన్నదే ప్రశ్న. ఒకవేళ.. అధిష్ఠానం ఒత్తిడిమేరకు .. ఒప్పుకున్నా.. కలిసి పనిచేసే అవకాశమే ఉండదని, కమలంలో ముసలం మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోంది.