ఆర్టికల్ 370 రద్దుతో... కశ్మీర్లో ఏదో జరిగిపోతున్నదని.. ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తున్నదంటూ గొంతు చించుకొని అరుస్తున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్కు వంత పాడుతూ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. అయితే, అదే సమయంలో చైనా సైతం అంతర్జాతీయంగా తన పరువును పోగొట్టుకుంది. కశ్మీర్ అంశంపై అత్యవసరంగా చర్చించేందుకు నిర్వహించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగియడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.
గంటకుపైగా జరిగిన చర్చల్లో ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది ఆహ్వానిత సభ్య దేశాల ప్రతినిధులు హాజరైనప్పటికీ కేవలం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవడానికే పరిమితమయ్యారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...అయితే జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షికమని, సమస్యలపై భారత్-పాక్ కలిసి చర్చించుకోవాలని భద్రతామండలి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీతోపాటు ఆహ్వానిత దేశాలైన ఐవరీకోస్ట్, గునియా, డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాలు భారత్కు అండగా నిలిచాయి. బ్రిటన్ నేరుగా మద్దతు ఇవ్వకున్నా.. ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పింది. ఒక్క చైనా మాత్రమే పాక్కు మద్దతు పలికింది.
చర్చల అనంతరం పరిణామాల విషయంలోనూ పాక్కు షాక్ తగిలినట్లు సమాచారం. చర్చల సారాంశాన్ని పేర్కొంటూ మీడియా ప్రకటన విడుదల చేయాలని చైనా వాదించింది. బ్రిటన్ సైతం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. అయితే.. ‘కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ అనేకమార్లు ఐరాసలో ప్రస్తావించింది. కానీ.. సమితి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడూ ఇదే విధానాన్ని పాటిద్దాం. చర్చల అనంతరం కశ్మీర్పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోవడం లేదు. మీడియా ప్రకటన కూడా లేదు’ అని మండలి అధ్యక్షురాలు చైనాకు స్పష్టం చేశారు. 15 సభ్య దేశాల ప్రతినిధుల్లో అత్యధికశాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సంయుక్త ప్రకటన విడుదల చేసేదిలేదని స్పష్టంచేశారు.