భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి కొత్త వాహన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనాల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది. దానికి తగ్గట్టుగానే అపరాధ రుసుములు వసూలు చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత దేశ రాజధాని నగరంలో వాహనాలు రోడ్డుమీదకు రావడానికి భయపడుతున్నాయి. అన్ని సక్రమంగా ఉంటేనే రోడ్డు మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.
ఏ ఒక్కటి లేకున్నా రోడ్డు మీదకు వాహనం తీసుకెళ్లడానికి జంకుతున్నారు. ఇప్పటికే వాహన చట్ట ప్రకారం వసూళ్లు భారీగా వస్తున్నాయి. గతంలో సిగ్నల్స్ వద్ద ఇష్టం వచ్చినట్టుగా జంప్ అయ్యేవారు. ఇప్పుడు అది తగ్గిపోయింది. స్పీడ్ కంట్రోల్ ఉండటంతో ప్రమాదాల బారి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని చూసి చూడనట్టుగా వదిలేయడంతో వాహన చోదకులు పెద్దగా పట్టించుకోలేదు.
ఏదో ఒక సాకు చూపించి తప్పించుకున్నారు. ఇకపై అలా కుదరదు. ఫైన్ కట్టాలి.. లేదంటే అన్ని కరెక్ట్ గా ఉండాలి. అది కుదరదు అంటే బండి ఇంట్లో పెట్టి ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేయాలి. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం పెంచడానికి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ వాహనాలు పెరిగిపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటె, నార్త్ లో అమలు జరుగుతున్న ఈ చట్టం సౌత్ విషయానికి వచ్చే సరికి పెద్దగా అమలు జరగడం లేదు. నిత్యం రోడ్డుపై వందలాది ఆటోలో పరుగులు తీస్తున్నాయి. ఆటోల్లో కిక్కిరిసిపోయి ప్రయాణాలు చేస్తున్నారు. కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చినా పెద్దగా అమలు జరగడం లేదు అన్నది వాస్తవం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ చట్టం అమలు జరుగుతుందా అంటే లేదని చెప్పాలి. మైత్రీవనం నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారులు ఆటోలు కిక్కిరిసిపోతున్నాయి. కొత్త చట్టం ఎక్కడ అమలు జరుగుతున్నదో మరి.