ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని గత కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు పడుతున్న అవస్థను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఎలాంటి సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, కార్మికుల సమ్మె విషయంపైనా, చేయవల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కెసిఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఇందులో
సునీల్ శర్మ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు.
సునీల్ శర్మ కమిటీలో ఎలాంటి విషయాలు పేర్కొన్నారు, అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.
ఇక ఇదిలా ఉంటె, ఈరోజు ఆర్టీసీ భవన్ ముందు కార్మికులు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీతో పాటుగా సిపిఐ కూడా పాల్గొన్నది. కార్మికులు 26 డిమాండ్లతో కూడిన నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆ డిమాండ్లను పూర్తి చేస్తూనే.. ప్రభుత్వంలో విలీనం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ససేమిరా అంటోంది.
కార్మికులను విధుల నుంచి తొలగించుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ, తమను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదని, తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే.. ఉద్యోగాల నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది. ఇప్పటికే కొంతమందిని తాత్కాలికంగా డ్రైవర్లు, కండెక్టర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు హైకోర్టు కూడా దీనిపై సీరియస్ కావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.