
వినాయకుడి విగ్రహానికి లేదా ఫోటోకు నాభి దగ్గర డబ్బు పెట్టే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది. దీనికి కారణం.. నాభి శక్తి కేంద్రం అని భావించబడటం. శరీరంలోని నాభిని ప్రాణశక్తి నిల్వగా పరిగణిస్తారు. ఆ కారణంగానే దేవుని విగ్రహంలోనూ నాభి ప్రాంతం శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. పండితులు చెబుతున్న విధంగా, అక్కడ డబ్బు పెట్టడం ద్వారా మన కోరికలు మాత్రమే కాక, డబ్బు ఇంటికి ఎక్కువగా వస్తుందని నమ్మకం ఉంది. అంతేకాదు, డబ్బు అనేది లక్ష్మీదేవి చిహ్నం. వినాయకుడి నాభి దగ్గర డబ్బు పెట్టడం అంటే, ఐశ్వర్యం మన జీవితంలోకి ప్రవహించాలి అనే సంకేతంగా కూడా భావిస్తారు. కొంతమంది జనాలు ప్రతి దేవత పూజలో దక్షిణ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. వినాయకుడికి దక్షిణ నాభి దగ్గర ఉంచడం మరింత ఉత్తమం అని శాస్త్రంలో చెప్పబడింది.
నాభి ద్వారా మనిషికి జీవనాధారం ఏర్పడుతుంది. ఆ విధంగానే డబ్బు అక్కడ ఉంచడం వల్ల జీవనంలో సంపద, ఆహార లోపం రాకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వినాయక చవితి, వివాహ, గృహప్రవేశం వంటి శుభకార్యాలలో వినాయకుడికి ప్రధమ స్థానం ఇస్తారు. వినాయకుడి నాభి దగ్గర డబ్బు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బును పూజారి లేదా పేదవారికి దానం చేస్తారు. ఇది చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. వినాయక చవితి రోజు విగ్రహానికి నాభి దగ్గర డబ్బు పెట్టి ఆ డబ్బును ఇంటి ఆడపడుచుకు ఇస్తే, అది లక్ష్మీదేవికి ఇచ్చినంత పుణ్యం దక్కుతుందని భావిస్తారు. అంతేకాదు, ఇంటికి వచ్చిన ఆడబిడ్డ నవ్వుతూ సంతోషంగా ఉంటే, ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ, సంతోషాలు, సిరిసంపదలతో నిండిపోతుంది అని నమ్మకం ఉంది. మొత్తానికి, నాభి దగ్గర డబ్బు పెట్టడం అనేది వినాయకుడి ఆశీర్వాదంతో పాటు ధాన్య, ఐశ్వర్య, సమృద్ధి కలగాలని సూచించే సంకేతం.