భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే సదరు భర్త నుండి భరణం చెల్లించాలని మహిళలు కోరడం సర్వసాధారణం. న్యాయస్థానాలు సైతం భార్యకు భరణం చెల్లించాలని  భర్తకు ఆదేశాలు జారీచేస్తాయి. కానీ, దీనికి విరుద్దంగా భర్తకే భార్య భరణం చెల్లించాలని పేర్కొంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కుటుంబ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి.. తనకు భరణం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం 2013లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. తనకు ఎటువంటి సంపాదన లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసిందని తెలిపాడు. నెల నెలా పింఛన్ అందుతోందని పేర్కొన్నాడు.

దీనిపై విచారణ చేపట్టిన ముజఫర్ ‌నగర్ ఫ్యామిలీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. మాజీ భర్తకు నెల నెల రూ.1,000 చొప్పున ఖర్చుల కోసం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రస్తుతం నెలకు రూ.12,000 ఫించన్ ఆమె అందుకుంటున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. కిశోర్ లాల్ శంకర్ (62) భార్య మున్నీ దేవి నుంచి కొన్నేళ్ల కిందట విడాకులు తీసుకున్నాడు. ముజఫర్‌నగర్ జిల్లా ఖాతౌలి పట్టణంలో ఓ చిన్న టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, టీ దుకాణం సక్రమంగా నడకపోవడంతో ఆదాయం పడిపోయింది. ఇదిలా ఉండగా ఆర్మీలో ఉద్యోగం చేసిన మున్నీ దేవి ఇటీవలే పదవీ విరమణ పొందింది. ఆమెకు ఫించన్ కింద నెలకు రూ.12,000 అందుతోంది. దీంతో తనకు భరణం ఇవ్వాలని కోర్టులో దావా వేశాడు. దీనిపై విచారణ పూర్తిచేసిన కోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు పలు చోట్ల చర్చనీయాంశమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: