ఇప్పటికే కరోనా వైరస్తో చిగురుటాకులు వణికిపోతున్న అమెరికాకు మరో దెబ్బపడింది. ఇప్పటికే వైరస్ మహమ్మారితో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఈస్టర్న్ తుఫాను గాలుల తీవ్రతతో సుమారు 19మంది మృతి చెందారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. లూసియానా నుంచి అప్పలాచియాన్ పర్వతసానువుల్లో వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే.. భారీగా గాలులు వీచే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రజలు కొంతమేరకు అప్రమత్తం అయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే కరోనా వైరస్ బాధితుల సంఖ్య లక్ష దాటింది. నగరంలో ఆదివారం ఒక్కరోజే 5,695 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,04,410కు పెరిగింది. మృతుల సంఖ్య 6,898కు చేరుకుంది. అమెరికా మొత్తం కేసుల్లో 20శాతం కేసులు న్యూయార్క్ నగరంలోనే నమోదు కావడం గమనార్హం. ఇక అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఐదున్నర లక్షలు దాటిపోయింది. ఇప్పటివరకు 22 వేల మందికిపైగా కరోనా వైరస్తో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇందులో 30 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.