ఏపీ రాజకీయాల్లో తాజాగా ఎమ్మెల్యేల ప్రవర్తనపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎక్కడో ఒక చోట తప్పులు చేస్తూ, విమర్శలకు గురవుతూ ఎమ్మెల్యేలు తిప్పలు తెచ్చుకుంటున్నారు. ప్రజలు, పార్టీలు, మీడియా – అందరూ ఈ అంశాన్ని గమనిస్తున్నా, ఈ పరిస్థితి ఎందుకు వస్తోందనే ప్రశ్న మరింత కీలకంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రధానంగా మూడు కారణాలు ఈ పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఒక నియోజకవర్గానికి ఎన్నికైన ఎమ్మెల్యే తానే ప్రధాన శక్తి, తానే అంతిమ అధికారి అన్న భావనతో వ్యవహరిస్తారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనే ధోర‌ణితో కొన్ని సార్లు అతిగా ప్రవర్తిస్తారు. గతంలో కూడా ఇలాంటి ధోరణి కనిపించినప్పటికీ, ఆ సమయంలో ప్రభుత్వ పథకాలు విస్తృతంగా అమలయ్యాయి.


ఎప్పుడూ రాజకీయాల్లో పోటీ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది మరింత తీవ్రమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రతి అంశంలోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రజలు తమ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలను క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ప్రజల కళ్ల ముందే ఉండాల్సిన ఒత్తిడి ఎమ్మెల్యేలపై పెరిగింది. ఈ ఒత్తిడి కొంతమందిని దూకుడుగా, కొన్నిసార్లు తప్పుదారిలో నడిచేలా చేస్తోంది. వ‌చ్చే ఎన్నికల వాతావరణం ఇప్పటికే ప్రారంభమైంది. పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రతరంగా మారింది. ఒకప్పుడు పార్టీ టికెట్ పనితీరు ఆధారంగా లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్థిక సామర్థ్యం, ఖర్చు చేసే స్థోమత టికెట్ కోసం కీలక ప్రమాణాలుగా మారాయి.


ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు సంపాదనపైనే దృష్టి పెట్టడం ప్రారంభించారు. ప్రజల సమస్యల కన్నా ఆర్థిక లాభం కోసం ప్రయత్నించడం వల్లే తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి, నియోజకవర్గ ఆధిపత్యం, పెరిగిన రాజకీయ పోటీ, రాబోయే ఎన్నికల ఒత్తిడి – ఈ మూడు ప్రధాన కారణాలే ఎమ్మెల్యేల తప్పుడు నిర్ణయాలకు మూలమని విశ్లేషకుల అభిప్రాయం. ఈ అంశాలను సరిచేసుకుంటే, ప్రజలతో అనుసంధానం పెంచుకుంటే, ఎమ్మెల్యేలు మంచి నాయకులుగా పేరు తెచ్చుకోవడం ఖాయం. లేకపోతే విమర్శలు, తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: