ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై తాజాగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో బిగ్ హాట్‌టాపిక్‌గా మారాయి. ఆమె వైఎస్ వారసురాలిగా ఏ మేరకు గుర్తింపు తెచ్చుకున్నారు, పార్టీని పుంజుకునేలా ఎంతవరకు కృషి చేశారు, ప్రజలు ఆమె గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే మూడు అంశాలపైనే విశ్లేషణలు ఎక్కువగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆమె తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలన్న ల‌క్ష్యంతోనే..! ఇప్పటికే పార్టీ నుంచి దూరమైన నాయకులను తిరిగి ఏకం చేయాలని, ప్రజల మనసు గెలుచుకోవాలని కేంద్రం ఆశించింది. అంతేకాక, ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం కూడా ఒక ముఖ్య కారణం. అయితే దాదాపు 16 నెలల పాలన తర్వాత కూడా పార్టీ స్థితిలో పెద్ద మార్పు కనిపించడం లేదు.


షర్మిల ప్రజా సమస్యలపై గళం వినిపించడం కంటే, అన్న జగన్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు పార్టీ లోపల మరియు బయట వినిపిస్తున్నాయి. దీనిపై సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు మౌనం పాటించారు. కొందరు నాయకులు అయితే ఇత‌ర పార్టీలవైపు కూడా వెళ్లిపోయారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పుంజుకోవాల్సిన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ కాలంలో కాంగ్రెస్‌కు ఉన్న పట్టు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజా ఉద్యమాలు, రోడ్ షోలు లేదా ఆందోళనలు లాంటి కార్యాచరణలో షర్మిల ముందడుగు వేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రత్యేక స్పందన రాలేదు. ఈ కారణంగా ఆమె వైఎస్ వారసురాలిగా తనదైన ముద్ర వేసుకోలేకపోయారన్న భావన పెరిగిపోతోంది.


విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, షర్మిల వాస్తవంగా వైఎస్ వారసత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే, ఇప్పటికి కాంగ్రెస్‌లో కొత్త ఊపు కనిపించేదని చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని, ఇంకా ఇదే తీరులో కొనసాగితే కాంగ్రెస్‌లో ఆమె త‌ప్పా కీల‌క నేత‌లు ఎవ్వ‌రూ ఉండే ఛాన్సులు క‌న‌ప‌డ‌డం లేదు. ఏదేమైనా ష‌ర్మిల ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి, గ్రామీణ స్థాయిలో మళ్లీ కాంగ్రెస్ సౌరభాలు రేపగలిగితేనే ఆమె భవిష్యత్తు నాయకత్వం బలపడుతుంది. లేకపోతే వైఎస్ చరిష్మాను కొనసాగించడంలో విఫలమైన నాయకురాలిగా మిగిలిపోతారన్నది స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: