గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే కాక తెలుగు చలన చిత్ర చరిత్రలో కూడా అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా నిలిచి పోయింది. ఒకరకంగా చిరంజీవిని ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. అయితే మాస్ సినిమా అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చిరంజీవి చక్కగా పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి సోదరులుగా మురళీ మోహన్ అలాగే తమిళ హీరో శరత్ కుమార్ లు నటించారు. ఈ సినిమా తరువాత ఈ ముగ్గురు కలిసి నటించిన సందర్భం మరొకటి లేదు. 


అలాగే ముగ్గురు కలిశారో లేదో కూడా తెలియదు. కానీ ఈ ముగ్గురు తాజాగా ఒక చోట కలిశారు. దీంతో అప్పటి కప్పుడు ఫోటో తీసి తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలోనే మురళీ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఆర్కా మీడియా (బాహుబలి ప్రొడ్యూసర్స్) వాళ్ల సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.


మరో పక్క శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న మణిరత్నం సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే శరత్ కుమార్ మురళీ మోహన్ ఇద్దరూ కలిసి ఆచార్య సైట్ కి వెళ్ళి చిరంజీవిని కలుసుకున్నారు. దీంతో ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగి తమ తమ అభిమానులతో పంచుకున్నారు. మే తొమ్మిదో తారీకు వస్తే ఈ సినిమా విడుదలై 30 ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ ముగ్గురూ కలుసుకోవటం ఆసక్తికరంగా మారింది. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: