మాములుగా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి కొన్ని రకాల సెంటిమెంట్ లు ఉంటాయి. ఒకసారి ఒక సెంటిమెంట్ వర్కౌటైతే ఆ సెంటిమెంట్ తో వరసగా సినిమాలు సినిమాలు చేస్తుంటారు. ఇలాంటి సెంటిమెంట్ ప్రిన్స్ మహేష్ కెరీర్లో కూడా ఒకటి ఉంది. మహేష్ బాబు దూకుడు సినిమా సమయంలో ఆ సినిమాలో మీనాక్షి దీక్షిత్ అనే అమ్మాయి నటించింది. ఆమెది చిన్న రోలే.. ఆ సినిమా హిట్టైంది. సినిమా హిట్టయ్యాక.. భరత్ అనే నేను సినిమాలో మీనాక్షికి ఛాన్స్ ఇచ్చారు మహేష్ బాబు..
ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మహర్షిలో కూడా అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా దూకుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లో వరసగా అవకాశాలు రావడం.. ఆ సినిమాల్లో మీనాక్షి ఉండటంతో మహేష్ బాబు సెంటిమెంట్ గా భావించాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు, అనిల్ రావిపూడిని పిలిచి ఆమెకు పాత్ర ఇవ్వమని చెప్పాడట.
ఇప్పుడు మీనాక్షి సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రోల్ చేస్తున్నది. మహేష్ బాబుతో సినిమా చేయాలనీ చాలామందికి ఉంటుంది. కొంతమందికి మాత్రమే అలాంటి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గ్రేటైతే.. ఓ ఆర్టిస్ట్ తన సినిమాలో ఉంటె తనకు కలిసి వస్తుందని చెప్పి, నటికి సినిమాలో ఛాన్స్ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ఒకవేళ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే.. మహేష్ బాబు మీనాక్షిని ఇక వదలడు అనే చెప్పాలి.
మహేష్ 26 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు సెట్స్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను చేయబోతున్నారు.