ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు బాగానే నమోదు అవుతున్నాయి. తాజాగా హయత్ నగర్ లో జరిగిన కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ చేసిన నేరస్తుడే ఆ అమ్మాయిని వదిలి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సోనీ అనే యువతిని కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య నగర శివారు బొంగుళూరు గేటు సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
గత మంగళవారం నాడు ఉదయం యాదయ్య టీ స్టాల్ దగ్గరకు శ్రీధర్ రెడ్డి అనే పేరుతో ఓ వ్యక్తి కారులో వచ్చాడు. ఆయన దగ్గర టీ తాగుతూ మాటలు కలిపాడు. అలా కుటుంబ వివరాలు సేకరించిన సదరు మోసగాడు బీఫార్మసీ చదువుతున్న తన పెద్ద కూతురు 21 సంవత్సరాల సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. కూతురికి ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో యాదయ్య తన కూతురు సోనితో పాటు కొడుకు డేవిడ్ను వెంటబెట్టుకుని శ్రీధర్ రెడ్డి కారులో బయలుదేరారు.
ఇలా నగరంలో కొద్ది గంటల పాటు అటూ ఇటూ తిప్పి వారికి నమ్మకం వచ్చేలా చేసిన రవి తర్వాత వారిని దింపేసి యాదయ్య కూతురు సోనితో కారులో వెళ్లాడు. కారులో వెళ్లిన వాడు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన యాదయ్య కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతని ఆచూకి తెలుసుకున్నాడు. విజయవాడకు చెందిన రవిశేఖర్ గతంలో పలు నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్కు గురైన బీ ఫార్మసీ అమ్మాయి సోనీ క్షేమంగా వచ్చింది. కిడ్నాపర్ రవిశేఖర్ తనకు తాను ఆమెను వదిలిపెట్టాడు. ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద సోనీని కిడ్నాపర్ వదిలేశారు.
అద్దంకి నుంచి బస్సులో వచ్చి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్స్టేషన్లో దిగిన సోనీ… అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. రవిశేఖర్ తనను వదిలిపెట్టాడని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు ఎంజీబీఎస్కు చేరుకుని అమ్మాయిని స్టేషన్కు తీసుకెళ్లారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న రవిశేఖర్ పై నాలుగు రాష్ట్రాల్లో 35 కేసులు ఉన్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సోనీని రవిశేఖర్ వారం రోజుల క్రితం తీసుకెళ్లాడని చెబుతున్నారు.
కాగా, హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవిశేఖర్ ను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే, ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా, ఒంగోలు శివార్లలో రవిశేఖర్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవిశేఖర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.