రేపు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగుల నిరసన ర్యాలీని శాంతియుత నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అనుమతి లేని ర్యాలీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.
రేపు తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్కు సమీపంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మరోవైపు, ఇప్పటికిప్పుడు చెప్పి నాగోలులోని మెట్రో గ్రౌండులో సభ నిర్వహించుకోమంటే ఎలా సాధ్యం అవుతుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు.
ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని జోయల్ డేవిస్ హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లాల ఎస్పీలు, నగరంలోని అందరు కమిషనర్లకు కోర్టు ఆదేశాల గురించి చెప్పామని ఆయన అన్నారు. జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ర్యాలీ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.