ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు హైదరాబాద్ SRనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.61 ఏళ్ల హనుమంత రావు తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా.. 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. 1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు.
ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.సినిమాల్లో తన కామెడీతో అందరినీ నవ్వించిన గుండు హనుమంతరావు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. 2010 లో భార్య చనిపోవడం, ఆ తర్వాత కూతురు కూడా దూరమవడంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయారు.
కిడ్నీ సమస్యలు రావడంతో వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశారు. సాయంత్రం ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. తాజాగా గుండు హనుమంతరావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలం ద్వారా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న హనుమంత రావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.