దేవుడు శాసించాడు.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని తమిళనాట అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా.. చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పిన ఆయన చివరకు తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి సస్పెన్స్కు తెరదించారు. అయితే తర్వాత సైలెంట్ అయిపోయిన రజనీ.. హిమాలయాల్లోకి వెళ్లి ప్రశాంత జీవనం గడిపి తిరిగి వచ్చిన ఆయన.. పొలిటికల్ లైఫ్లో బిజీ కాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తోంది. ఇక రజనీ రాజకీయాల్లో టాప్ గేర్ వేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే పార్టీ విధివిధానాలు, పార్టీ ఎజెండాను ప్రజలకు వివరిస్తారనే టాక్ ఇప్పుడు తమిళనాట మారుమోగుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ జర్నీని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.
అమ్మ జయలలిత మరణం తర్వాత తమిళనాట పొలిటికల్ గ్యాప్ అధికమైంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు బలంగా వినిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఆయనపై రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి పెరిగినా.. అమ్మ మరణంతో ఇది మరింత అధికమైంది. ఇదే సమయంలో మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేగాక పార్టీని కూడా ప్రకటించి వివిధ రాజకీయ నాయకులను కలుస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా అతి త్వరలోనే ఆయన పార్టీపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హిమాలయాలకి వెళ్లి వచ్చిన తలైవా తన పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.
రజనీకాంత్ తన పార్టీకి `మక్కల్ మంద్రమ్` అనే పేరుని పెట్టబోతున్నాడని కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీకి సంబంధించిన మెంబర్స్, డిస్ట్రిక్ట్ యూనిట్స్ వారికి ఐడెంటిటీ కార్డ్స్ రిజిస్ట్రేషన్స్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం, అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించారు.
పొలిటికల్ ఎంట్రీ విషయంపై ఎంతో సస్పెన్స్ సృష్టించిన రజనీ...హిమాలయాల పర్యటన తర్వాత దాన్ని వేగవంతం చేశారని సమాచారం. పార్టీకి సంబంధించి కొత్తగా నియమితులైన కార్యాలయ-బేరర్లు తమిళనాడు అంతటా 65000 పోలింగ్ బూత్లలో రజినీ మక్కల్ మండ్రం శాఖలను తెరవడం ఆసక్తిగా మారింది. ఒక్కో బూత్ బ్రాంచ్ లో 30 మంది సభ్యులు ఉండేలా రజనీకాంత్ ప్లాన్ చేశారట. ప్రతి జిల్లాలో కార్యదర్శి, కో-సెక్రటరీ, జిల్లా ఉప కార్యదర్శులు, న్యాయవాదుల వింగ్ , రైటర్స్ వింగ్, మహిళల విభాగాల ప్రతినిధులు ఉంటారు. 38 జిల్లా విభాగాల్లో కనీసం 15 మంది ఆఫీస్ బియరర్స్ నియమించిన వారు గ్రామీణ యూనియన్ టౌన్ పంచాయితీ యూనిట్లలోను పాలు పంచుకోనున్నారు. మొత్తానికి రజనీ పెద్ద వ్యూహంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని స్పష్టమవుతోంది.