కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ , బీజీపీలకు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ ఎన్నికల పోరులో పోటీ హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాల సరళి కనిపిస్తోంది. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బీజేపీ - కాంగ్రెస్ 20, 30, 40, 50, 60, 70, 80 ఇలా రెండు పార్టీలు ఇదే రేంజ్లో ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే కాంగ్రెస్ 78 సీట్లలోనూ, బీజేపీ 87 సీట్లలోనూ, జేడీఎస్ 30 సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక టైంలో రెండు నియోజకవర్గాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు చాముండేశ్వరిలో జేడీఎస్ అభ్యర్థి చేతిలో 7 వేల ఓట్ల ఆధిక్యంతో వెనకపడిన ఆయన బదామిలో మాత్రం శ్రీరాములుపై ముందంజలో ఉన్నారు. ఇక శ్రీరాములు మరో చోట మొళకాళ్మూర్లో మాత్రం ముందంజలో ఉన్నారు. సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర వరుణలో ముందంజలో ఉన్నారు.
జేడీఎస్ అధినేత కుమారస్వామి తాను పోటీ చేసి రెండు చోట్ల చెన్నపట్టణ, రామ్నగర్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక దేవనాగరి (ఉత్తర) నియోజకవర్గంలో మల్లికార్జున ఖర్గే కుమారుడు, కనకపురాలో డీకే శివకుమార్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. మైనింగ్ డాన్ గాలి జనార్ధన్రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్రెడ్డి బళ్లారి సిటీ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాలి మరో సోదరుడు కరుణాకర్రెడ్డి హర్పనపళ్లిలో లీడ్లో ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శికారిపురలో ముందంజలో ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్న రామలింగారెడ్డి బీటీఎం లేఅవుట్ స్థానం నుంచి లీడ్లో ఉంటే, బాగేపల్లిలో హీరో సాయికుమార్ ఎదురీదుతున్నారు. ఇక లింగాయత్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అనూహ్యంగా బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక చాముండేశ్వరి నియోజకవర్గంలో 14 వేల ఓట్ల తేడాతో జేడీఎస్ అభ్యర్థి చేతిలో వెనకపడి దాదాపు ఓటమి దిశగా వెళుతున్నారు.
పాత మైసూరులో జేడీఎస్ దూకుడుకు అడ్డు లేకుండా పోతోంది. సెంట్రల్ కర్ణాటక, ముంబై కర్ణాటక, కోస్తా కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక ఫలితాలు ప్రతి నిమిషానికి మారుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించే ఛాన్సులు ఉన్నాయి.