పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపిప రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించారు. 125ఓట్లు సాధించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూకు చెందిన ఎంపీ, పాత్రికేయుడు హరివంశ్నారాయణసింగ్, విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీకే ప్రసాద్ బరిలో నిలిచారు. బీకే ప్రసాద్కు కేవలం 105ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎట్టకేలకు బీజేపీ తన భాగస్వామ్య పక్షమైన జేడీయూ అభ్యర్థిని గెలిపించుకోవడం గమనార్హం. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను అటు అధికార పక్షం, ఇటు విపక్షం సవాల్గా తీసుకున్నాయి. ఈ మేరకు గెలుపుకోసం వేటికవి ముమ్మరంగా ప్రయత్నం చేశాయి.
అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ సభ్యులు విపక్షకూటమి అభ్యర్థి బీకే ప్రసాద్కే ఓటు వేశారు. ఇక పీడీపీ, ఆప్, వైసీపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉన్నపార్టీల సభ్యులే కీలకంగా మారారు. బీజేడీ చెందిన 9మంది సభ్యులు, టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు సభ్యులు, శివసేన తదితర పార్టీల సభ్యులు దాదాపుగా హరివంశ్కు మద్దతు తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేత`త్వంలోని విపక్ష కూటమికి ఊహించని దెబ్బ తగలిందనే చెప్పాలి. ఎందుకంటే.. గత నాలుగు దశాబ్దాలుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కొనసాగుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆ పార్టీ పదవిని కోల్పోవడం గమనార్హం. నిజానికి సంఖ్యాపరంగా చూస్తే.. విపక్ష కూటమికి 113మంది ఉన్నా.. అందులో ఈ రోజు ఓటింగ్ రాకపోవడంతో 105 ఓట్లే వచ్చాయి. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలుకూడా రాలేదు.
ఈ ఎన్నికల్లో 12మంది నాటినేటెడ్ సభ్యులు కూడా అధికార కూటమి అభ్యర్థి హరివంశ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చకచకా పావులు కదిపారు. వెనువెంటనే తటస్థ పార్టీల మద్దతు కూడగట్టారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ల ఫోన్ చేసి మద్దతు కోరారు. ఒకవేళ ముందే కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై బీజేడీ మద్దతు కోరితే పరిస్థితి మరోలా ఉండేదని పలువురు నాయకులు అంటున్నారు. ఏదేమైనా.. విపక్షాల ఐక్యత చాటి సాధారణ ఎన్నికలకు శంఖారావం పూరించాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి కొంత నిరుత్సాహ ఫలితమే ఎదురైందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో సభలో ప్రధాని మోడీ ఉత్సాహంగా కనిపించారు.