విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలతో కీలక సమావేశం నిర్వహించిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం మొదలైంది. ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ జగన్ పిలుపునివ్వటం వరకూ ఓకేనే. కానీ అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులున్నారా అన్నదే అసలు ప్రశ్న. పార్టీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం పార్టీకి కర్తలున్నారు, నేతలున్నారు. కానీ గట్టి అభ్యర్ధులే అన్నీ చోట్ల లేరని సమాచారం.
రాయలసీమలో ఇబ్బంది లేదు
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలను గమనిస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమలోనే పార్టీ బాగా బలంగా ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పోయిన ఎన్నికల్లో 52 సీట్లకు గాను వైసిపికి 30 స్ధానాలు వచ్చాయి. పై నాలుగు జిల్లాల్లో సామాజికవర్గాలతో నిమ్మిత్తం లేకుండా రెడ్లదే ఆధిపత్యం. ఒకపుడు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడిన రెడ్లు రాష్ట్ర విభజన తర్వాత వైసిపికి అండగా నిలబడ్డారు. అదే సమయంలో ముస్లింలు కూడా పూర్తిగా మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా పై జిల్లాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు.
కోస్తాలో 20 సీట్లలో గట్టి అభ్యర్ధులు లేరా ?
ఇక, కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలను తీసుకుంటే పోయిన ఎన్నికల్లో పెద్దగా ఆధరణ లభించలేదు. ఈ జిల్లాల్లో 58 సీట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నది పశ్చిమగోదావరి జిల్లాలో అన్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలోని 15 సీట్లో వైసిపికి ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాలేదు. మిగిలిన జిల్లాలో 28 స్ధానాలొచ్చాయి. పై జిల్లాలో జగన్ కు భారీ ఎత్తున జనాలు పాదయాత్రలో స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ వర్గాల ప్రకారమైతే మొత్తం 58 సీట్లలో ఇప్పటికి సుమారు 20 సీట్లలో గట్టి అభ్యర్ధులు లేరు.
ఉత్తరాంధ్రలో 15 మంది అవసరం
చివరగా మిగిలింది ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలే. ఈ జిల్లాల్లో 34 సీట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో వైసిపికి వచ్చింది 9 సీట్లు మాత్రమే. చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే దొరకలేదు. మూడు జిల్లాల్లో తలా మూడు సీట్లొచ్చాయి. ఇప్పటికి కూడా అన్నీ నియెజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరకలేదని సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఓ 20 సీట్లలో మాత్రమే గట్టి అభ్యర్ధులున్నారట. మొన్ననే విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో ఇందుకూరి రఘురాజు వైసిపిలో చేరారు. రాజు చాలా గట్టి అభ్యర్ధిగా ప్రచారంలో ఉంది. అంటే ఇటువంటి గట్టి అభ్యర్ధులు కనీసం ఇంకో 15 చోట్ల చాలా అవసరం.
పాదయాత్రే వైసిపిని ఆదుకుంటుందా ?
పోయిన ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులే చేతులార వివిధ కారణాలతో విజయాన్ని దూరం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ తప్పులు జరగకూడదన్న జగన్ ఉద్దేశ్యం. అందుకనే 3 వేల కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. జగన్ వ్యూహానికి తగ్గట్లే జనాలు కూడా బాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. పాదయాత్రలో భాగంగానే చాలా చోట్ల జగన్ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జగన్ చూసుకోగలిగితే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. అందులోను చంద్రబాబు పాలనపై వ్యతిరేకత పెరిగిపోతున్న నేపద్యంలో వచ్చే ఎన్నికల్లో పాదయాత్రే జగన్ ను కాపాడాలి.