రాష్ట్రంలో అతి పెద్ద విపక్షం వైసీపీ. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం మెండుగా ఉన్న పార్టీ. అయితే, ఇటీవల దురదృష్టవశాత్తు.. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్పై విశాఖలో కోడి కత్తి దాడి జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే, ఈ దాడి ఘటన జరిగిన వెంటనే విశాఖ విమానా శ్రయం నుంచి జగన్ వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత .. అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక, ఈ దాడి ఘటనలోతమ వైఫల్యం ఎక్కడ బయట పడుతుందోనని భావించిన టీడీపీ పెద్దలు.. ఈ అంశాన్ని భూతద్దంలో చూపించడం ప్రారంభించారు.
విశాఖలో జగన్ ఎందుకు వైద్యం చేయించుకోలేదు. అనే విషయాన్ని టీడీపీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. దీనిని వాడుకుని వైసీపీపై యుద్ధం చేస్తోంది. అయితే, ఈ దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాల్సిన వైసీపీ నాయకులు తడబడ్డా రు. ఇష్టానుసారంగా ఎవరికి వారే మాట్లాడారు .అదికూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారే ఇలా మాట్లాడితే.. పార్టీ పరువు ఏమవుతుందనే ఆలోచన కూడా చేయలేక పోవడం గమనార్హం. ఇంతకీ జగన్ వైద్యంపై ఎవరు ఏమన్నారో చూద్దాం.. గాయం చిన్న దే. అందుకే హైదరాబాద్ వెళ్లారు అని ఒకరు అన్నారు. హైదరాబాద్కు వెళ్లిపోవచ్చునని విశాఖలో ప్రథమ చికిత్స చేసిన డాక్టరే చెప్పా రు! ఇంకొకరు చెప్పిన మాట ఇది. విశాఖ ఆస్పత్రిలో అయితే జగన్పై విషప్రయోగం జరిగేది! అని మరొకరు చెప్పుకొచ్చారు.
వైసీపీలో అత్యంత కీలకనేతలైన.. విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వరప్రసాద్, బొత్స సత్యనారాయణ, బాలశౌరిలు తమ నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. అప్పటికి అది పెద్ద గాయం కాదు. కానీ, పెద్ద గాయం అవుతుందన్న ఉద్దేశంతో హైదరాబా ద్ ఆస్పత్రిలో చేరారు అని మేకపాటి బదులిచ్చారు. అదే సమయంలో, విశాఖ ఆస్పత్రిలో చేరితే శాంతి భద్రతల సమస్య వచ్చేదన్నారు. విమానాశ్రయంలో ఉన్న డాక్టరు జగన్కు ప్రథమ చికిత్స చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. విశాఖ ఆస్పత్రిలో చేరితే జరగరానిది జరిగేదని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు అక్కడి ఆస్పత్రులను ప్రభావితం చేసేవారు. విష ప్రయోగం జరిగే అవకాశం కూడా ఉండేది. అది చంద్రబాబు నైజం. ఎవరినైనా మేనేజ్ చేయగలరు’’ అని విజయసా యి తెలిపారు.
విశాఖలో వైద్య చికిత్స పొందడం మంచిది కాదనే హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. విశాఖ పట్నం ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసుల పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం లేనందున జగన్ హైదరాబాద్కు వెళ్లి ఆస్పత్రిలో చేరారు అని విజయసాయి తెలిపారు. మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ... విశాఖతో పోల్చితే హైదరాబాద్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉంటాయనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అలాగే, ఎయిర్పోర్టులోని డ్యూటీ డాక్టర్ సూచన మేరకే జగన్ హైదరాబాద్కు వెళ్లారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొత్తానికి ఈ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీని బద్నాం చేశాయనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేతలను వెంటేసుకుని జగన్ రాజకీయాలు చేయడం ప్రమాదకరమని కూడా సూచనలు సలహాలు అందుతున్నాయి.