పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో కీలకమైన అధికారులు డుమ్మా కొట్టారు. ఎన్నికల కోడ్ కారణంగానే అధికారులు చంద్రబాబు టూర్ కు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడ సాధారణ పరిపాలనను కొనసాగించేందుకు ఎలాంటి అడ్డంకులు కల్పించ కూడదని ఏపీ సీఎం చెబుతున్నారు. అయితే గత మాసంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు, సీఆర్డీఏ సమీక్షలను నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే చంద్రబాబు రోజురోజుకూ ఒంటరై పోతున్నారన్న వాదన అంతకంతకూ పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ కారణంగా ప్రజా ప్రభుత్వాలకు ఉన్న అధికారాలన్నీ రద్దైపోయాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏపీలో అయితే ఈ కోడ్ కాస్తంత గట్టిగానే పనిచేస్తోందని చెప్పాలి. అయితే నెలల తరబడి కోడ్ అంటే ఎలాగంటూ నోసలు చిట్లించిన చంద్రబాబు, ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను సమీక్షలు చేస్తానని ఎవరు అడ్డుకుంటారో? చూస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల సమీక్షలను నిర్వహించిన విషయాన్ని కూడ పదేపదే చంద్రబాబు ప్రస్తావించారు. బిజినెస్ రూల్స్ కు విరుద్దం గా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నానని దమ్ముంటే అడ్డుకోవాలని కూడా ఆయన సవాల్ విసిరారు. అనుకున్నట్లుగానే నేటి ఉదయం ఆయన పోలవరం ప్రాజెక్టుకు బయ లుదేరారు. ప్రాజెక్టు వద్ద పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న మీడియాతోనూ చాలా విషయాలు మాట్లాడారు. పోలవరం జన్మవృత్తాంతాలను చదివి వినిపించారు. బాబు పర్యటన సందర్భంగా పొలవరం బాధ్యతలతో అక్కడే విధులు నిర్వహించే నీటి పారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, సీఈలు, ఈఈలు మాత్రమే హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఎప్పుడు పోలవరం వచ్చినా, ఆయన వెన్నంటే కనిపించే సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాత్రం కనిపించలేదు. ఎక్కడైనా పక్కన ఉన్నారేమో? అని చాలా సేపు చూసినా శశి భూషణ్ కుమార్ జాడే కనిపించలేదు. చంద్రబాబు పోలవరం పర్యటన ముగిసే దాకా పరిశీలించినా, ఆయన జాడ కనిపించ లేదు. మొత్తంగా ఈ సారి చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా శశి భూషణ్ కుమార్ డుమ్మా కొట్టారని తేలిపోయింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల కలక్టర్లు హాజరు కాలేదు కాని చంద్రబాబు పర్యటనను పురస్కరించుకొని అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రాజెక్టు వద్దకు మాత్రం హాజరుకాలేదు.
టీడీపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తు పోలవరం ప్రాజెక్టులో ఈ మాత్రం పనులైనా జరిగాయంటే అది శశి భూషణ్ కుమార్ వల్లనే. అలాంటి అధికారి ఎక్కడ కనిపించినా చివరకు ప్రైవేట్ ఫంక్షన్లలో కనిపించినా కూడా చంద్రబాబు ఆగి మరీ పలకరిస్తున్న దృశ్యాలు కూడా చూశాం. అలాంటిది ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల గ్యాప్ తర్వాత చంద్రబాబు పోలవరం పర్యటనకు వచ్చినా శశి భూషణ్ కుమార్ అక్కడ కనిపించలేదు. దీనికి కారణం ఎన్నికల కోడేనని చెప్పాలి.
ఈసీపై నిత్యం తనదైన శైలి విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు తగిన రీతిలో గుణపాఠం చెప్పే క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్లంతా ఏకమైపోయారని ఈ క్రమంలోనే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా చంద్రబాబు సమీక్షలకు అధికారులు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేశారు కదా. ఈ నేపథ్యంలోనే శశి భూషణ్ చంద్రబాబు పోలవరం పర్యటనకు దూరంగా ఉన్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంటే, మొత్తంగా చంద్రబాబు పోలవరం పర్యటనలో ఒంటరైపోయారన్న మాట.