తాజాగా రాజమండ్రి ఎంఎల్ఏ,
సీనియర్ నేత బుచ్చయ్య చౌధరి చేసిన వ్యాఖ్యలపైనే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ
జరుగుతోంది. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో బుచ్చయ్య మాట్లాడుతూ వైట్ ఎలిఫెంట్లకు
చంద్రబాబునాయుడు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. అలాగే
ఐదుసార్లు పోటి చేసి ఓడిపోయిన వారికి కూడా చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు
చౌదరి మండిపోయారు.
బుచ్చయ్య మాట్లాడినపుడు ఏ ఒక్కరి పేరు నేరుగా ప్రస్తావించలేదు. కాకపోతే ఐదుసార్లు ఓడిపోయిన వాళ్ళకు చంద్రబాబు ఎందుకు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అడిగిన ప్రశ్న మాత్రం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా అనుకుంటున్నారు. ఎందుకంటే ఐదుసార్లు పోటిచేసి ఓడిపోయిన నేత సోమిరెడ్డి తప్ప మరొకరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి వరుసగా ఐదుసార్లు పోటిచేసి ఓడిపోయారు.
అంటే బుచ్చయ్య చేసిన కామెంట్లలో ఒక విషయంలో క్లారిటి వచ్చినట్లే. మరి రెండో కామెంట్ అయిన వైట్ ఎలిఫెంట్లు ఎవరు ? అన్న విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైట్ ఎలిఫెంట్ క్యాటగిరిలో కూడా సోమిరెడ్డి వస్తారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, నియోజకవర్గంలో ఓడిపోయినా ఎంఎల్సీ పదవి దక్కించుకుంటున్నారు సోమిరెడ్డి. అలాగే మంత్రి కూడా అయ్యారు. అయితే ఈయన వల్ల నియోజకవర్గానికి కానీ జిల్లాలో కానీ పార్టీకి ఏమీ ఉపయోగం లేదని తేలిపోయింది.
బుచ్చయ్య చెప్పిన వైట్ ఎలిఫెంట్లు ఎవరు అన్న విషయంలో మాత్రం క్లారిటి రాలేదు. పార్టీ నేతల ప్రకారం ప్రతి జిల్లాలోను కనీసం పదిమంది ఎలిఫెంట్లు ఉంటారట. పార్టీ వల్ల వాళ్ళు లాభపడటమే కానీ వాళ్ళ వల్ల పార్టీకి ఏమాత్రం లాభం ఉండటం లేదట. మొన్నటి వరకూ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన వాళ్ళల్లో చాలామంది అభ్యర్ధులను గెలిపించలేకపోయారని ఇపుడు పార్టీలో చర్చ జరుగుతోంది. బుచ్చయ్య చెప్పినట్లు ఆ వైట్ ఎలిఫెంట్లెవరో బయటపడకపోతుందా ?