ఏపీలోప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించబోతోంది. ఈమేరకు నిర్ణయం జరిగిపోయింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సెల్స్మెన్, సూపర్వైజర్, వాచ్ అండ్ వార్డు ఉంటారు. వీరి కోసం నియామకప్రక్రియ కూడా పూర్తయిపోయింది. దీని గురించి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి మరో షాకింగ్ విషయం చెప్పారు.
ఆయన ఏమన్నారంటే.. “ 16 వేల మందికి జీవనోపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాం.
ప్రతి మద్యం షాపును ఏ విధంగా రన్ చేయాలి, మద్యపానాన్ని ఏ విధంగా తగ్గించాలనే ఆలోచనతో ఒక ఎస్ఐ, సీఐకి కలిసి పది షాపుల బాధ్యతను అప్పగించడం జరిగింది’ అని మంత్రి నారాయణస్వామి అన్నారు.
మద్య నిషేధంలో భాగంగానే బెల్టు షాపులు పూర్తిగా తొలగించడం జరిగిందని, అదే విధంగా అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ తీవ్రంగా కృషిచేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ద్వారా 100 మంది కానిస్టేబుళ్లను తీసుకునేందుకు సీఎం వైయస్ జగన్ అనుమతి ఇచ్చారన్నారు.
అంతేకాకుండా 660 మంది నూతన కానిస్టేబుళ్ల భర్తీకి కూడా అనుమతి అడిగామని, అది కూడా త్వరలో వస్తుందన్నారు. ప్రతి వ్యక్తి సహకరిస్తేనే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం జరుగుతుందన్నారు. సారాయి, గంజాయి అక్రమ రవాణాలను అరికట్టే కార్యక్రమాలు పకడ్బందీగా చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, మెన్లను ఏ విధంగా ఉపయోగించాలని డీజీపీతో ఇప్పటికే చర్చించడం జరిగిందన్నారు.
మందు మానాలనుకుంటున్న వారి కోసం.. ప్రతి ఆస్పత్రిలో డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మద్యపాన నిషేధం కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. ఇందుకు ప్రతిపక్షం కూడా సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు.