ఏపీ సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఏ ఏజెన్సీకి ఇచ్చినా కూడా వసూళ్ల పర్వం కొనసాగింది. ఉద్యోగానికి ఇంత చొప్పున ఏజెన్సీలు కొల్లగొట్టాయి. ఇక ఇప్పుడు అలాంటి దోపిడీ, అవినీతి కార్యక్రమాలు కొనసాగించకుండా, ప్రతి రూపాయి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సరాసరి ఈ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్లో పని చేసే వేతన కార్మికులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్షమందికిపైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ వీరు ఆయా ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవుతున్నారు. నియమాకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగినట్టుగా ఉద్యోగులకు చెందాల్సిన జీతం పూర్తిస్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.ఏజెన్సీలు నడుపుతున్నవారు తమకు నచ్చిన రీతిలో ఈనియామకాలను చేపడుతున్నారు.
ఇకపై ఆ ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. సాధారణ పరిపాలనాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. కార్పొరేషన్కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లా ఇన్ఛార్జిమంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు, జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్కు ఎక్స్అఫీషియోలుగా వ్యవహరిస్తారు.
రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్కు, దీనికింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి. ఈ కార్పొరేషన్ లాభాపేక్ష లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారికి ఒకేపనికి ఒకే రకమైన జీతం లభిస్తుంది.