మహరాష్ట్ర రాజకీయ ఉత్కంఠతకు దాదాపుగా తెరపడినట్టేనా అంటే అవుననే అంటున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు వికాస్ మహా అఘాడి కూటమిగా ఏర్పడి అధికారాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్న సమయంలో అజిత్ పవార్ ఈ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత సీన్ మారిపోయింది. సుప్రీం కోర్టుకు వెళ్లడం.. సుప్రీం కోర్టు ఈరోజు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని చెప్పడంతో అజిత్ పవార్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో మొత్తం మారిపోయింది.
ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. తాము ఎలాంటి ప్రలోభాలు పెట్టలేదని, అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శివసేన కూటమి నుంచి వైదొలికి మోసం చేసినట్టు అయన పేర్కొన్నారు. మొత్తానికి ట్విస్ట్ కాస్త తొలగిపోయింది. ఈరోజు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణస్వీకారం ఉండబోతున్నది.
అజిత్ పవార్ తిరిగి వస్తే ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ, ఆయన్ను కాదని శరద్ పవర్ అజిత్ పాటిల్ కు అవకాశం ఇచ్చారు. ఆయన్నే ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అజిత్ ను పక్కన పెట్టడంతో అజిత్ కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.అజిత్ ను పక్కన పెట్టడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. అది వేరే సంగతి. అయితే, మొదట డిసెంబర్ 1 వ తేదీన ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అనుకున్నా, ఆ తేదీని అనూహ్యంగా మార్చారు.
డిసెంబర్ 1 వ తేదీన కాకుండా నవంబర్ 28 వ తేదీనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. డిసెంబర్ 1 వరకు ఆగితే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని ఉద్దవ్ భావిస్తున్నాడు. బీజేపీలో అపర చాణిక్యులు ఉన్నారు. శరద్ పవార్ మనసు మారొచ్చు. ఇంకేదైనా జరగొచ్చు. అందుకే వీలైనంత త్వరగా అధికారం చేపడితే.. మంచిది అన్నది ఉద్దవ్ ఆలోచన. అందుకే ఈనెల 28 వ తేదీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నాడు.