గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న జగన్.. మంత్రుల కేటాయింపులోనూ సోషల్ ఇంజినీరింగ్ అమలు చేశారు. ఏకంగా ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. వాటిలో దళితుడైన చిత్తూరు జిల్లా నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అమ్మఒడి కార్యక్రమం సందర్భంగా చిత్తూరు వచ్చిన సీఎంకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు చాటుకున్నారు. దళితుడినైన తనను రాజకీయంగా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో సన్నని నీటిపొర కనిపించింది.
యుగపురుషుడు వైయస్ఆర్ తనను ఎమ్మెల్యేను చేశారని.. ఇప్పుడు జగన్ ఏకంగా డిఫ్యూటీ సీఎంను చేశారంటూ వైఎస్ ను గుర్తు చేసుకున్నారు. జీడీ నెల్లూరును దత్తత తీసుకొని డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. మా నియోజకవర్గాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నానని నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ అందరి సమస్యలు విన్నారు. పాదయాత్ర ముగిసి ఈ రోజుకు ఏడాది అవుతుంది. చిత్తూరు చరిత్రను మార్చింది వైయస్ జగనే. ఏ హృదయంలో చూసినా వైయస్ జగన్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. దళితులు ఊరికి దూరంగా ఉన్నారు. వారిని దగ్గర చేస్తూ..అంబేద్కర్ కన్న కలలను నెరవేర్చుతూ..రాజకీయంగా తనకు ప్రాధాన్యత ఇచ్చిన వైయస్ జగన్ రుణం తీర్చుకోలేను. బడుగు, బలహీన వర్గాలు ఒకప్పుడు స్కూళ్లకు దూరంగా ఉండేవాళ్లం. ఈ రోజు వైయస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నారు.
ప్రతి ఒక్కరూ నవరత్నాల ద్వారా బాగుపడాలని సీఎం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ రోజు ఆర్థికంగా, రాజకీయంగా,విద్యాపరంగా వెనుకబడ్డాం. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారు. గతంలో ఎంతో మంది క్రిస్టియన్ స్కూళ్లలో చదువుకున్నారు. వారు మతం మార్చుకున్నారా? ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఆలోచనతో వైయస్ జగన్ ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తే..మత మార్పిడి అంటున్నారు. పేద పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారని, వైయస్ జగన్ కుటుంబాన్ని అందరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.