అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి జేసీ దివాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ ఓటమి తరువాత ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని చెప్పారు. జేసీ సోదరులే తాడిపత్రిలో మట్కా నిర్వహించారని చెప్పారు. 
 
తనపై ఆరోపణలు చేస్తున్నారని తనపై వచ్చిన ఆరోపణలకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని పెద్దారెడ్డి తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆ డబ్బులు ఎలా సంపాదించారో చెప్పాలని పెద్దారెడ్డి అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఆలయాల కొరకు ఇచ్చిన విరాళాలను కూడా స్వాహా చేశారని పెద్దారెడ్డి ఆరోపణలు చేశారు. జేసీ సోదరులు గ్రామాలలో ముఠాకక్షలు రేపేందుకు కుట్రలు పన్నుతున్నారని పెద్దారెడ్డి అన్నారు. 
 
పెద్దారెడ్డి జేసీ సోదరులపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో పోలీసులపై నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో తప్పేమిటని పెద్దారెడ్డి ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎలాంటి కక్షపూరిత చర్యలు ఎవరి విషయంలో ఉండవని పెద్దారెడ్డి అన్నారు. 
 
జేసీ వైసీపీ పార్టీలో చేరతానన్నా చేర్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని పగ తీర్చుకున్న గత చరిత్రను మరిచిపోయారా...? అంటూ పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో పోలీసుల చుట్టూ తిరిగారని అన్నారు. జేసీ దివాకర్ రెడ్డిని ఎవరూ పార్టీలోకి ఆహ్వానించలేదని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం కక్ష సాధింపు చర్యలు అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: