ప్రపంచంలో ఇప్పుడు కరోనా ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. కేవలం ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక నష్టాలను కూడా తెచ్చిపెట్టింది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.. మనుషుల ప్రాణాలతో మొదటి నుంచి ఆడుకునే ఉగ్రవాదులు కరోనా టైమ్ లో రెచ్చిపోవడం ఒకంత ఆయా దేశాలకు కష్టకాలంగానే ఉంది. అయితే గత సంవత్సరం నుంచి భారత్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అందరికీ తెలిసిందే. గత ఏడాది పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు.. ఆ తర్వాత భారత్ ఆగ్రహావేశానికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అయినా ఏమాత్రం వారి దాడులు ఆపడం లేదు.
గత కొన్ని రోజులుగా పదే పదే జమ్మూకాశ్మీర్ కేంద్రంగా చేసుకొని సైన్యంపై దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నారు. ఆ మద్య పుల్వామా తరహా దాడికి యత్నించి విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులు ఏరకంగా రెచ్చిపోయినా.. భారత ఆర్మీ వారికి ఎప్పటికప్పుడు బుద్ది చెబుతూనే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఇండియన్ ఆర్మీ ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి.. వారిని అంతమొందిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో.. ఉగ్రవాదులను ఏరివేసే పనిలో బలగాలు నిమగ్నమయ్యాయి.
కశ్మీర్ ఐజీసీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. సోపియాన్ జిల్లాలో ఆదివారం ఐదుగురిని, సోమవారం నలుగురు ఉగ్రవాదులను హతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజలుగా ఉగ్రవాదులు రక రకాలుగా దాడులకు పాల్పపడుతూనే ఉన్నారు.. వారి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతూనే ఉందని.. గత వారం రోజుల నుంచి మొత్తం 15 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జనవరి నుంచి ఇప్పటి వరకు భారత బలగాల ఆపరేషన్లో మొత్తం 84 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు.