దేశంలో కరోనా వైరస్ మొదలైన్పటి నుంచి దాని వల్ల ఎంతో ప్రమాదం ఉందని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అది ఇతరులకు సోకుతుందని కరోనా బాధితులకు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ కొంత మంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ క్వారంటైన్, ఐసోలేషన్ వార్డు ల నుంచి తప్పించుకు పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి హైదరాబాద్లోని కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ రూరల్ జిల్లా రాయపత్రి మండలం కొండాపూర్ వాసి (48) ఆసుపత్రి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. వృద్దాశ్రమంలో పనిచేస్తున్న ఆయన ఈ మద్య అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం ఈ నెల 15న కింగ్ కోఠి ఆసుపత్రిలో చేరాడు.
అయితే, నిన్న తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేటకు చేరుకున్నాడు. హైదరాబాద్ నుంచి బయలు దేరే సమయంలో అతని సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. సూర్యా పేట నుంచి తొర్రూర్ కి బయలు దేరాడు. ఆ మద్య సూర్యపేటలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం వెంటనే ఆయన సోదరుడు వైద్యులు, పోలీసులకు సమాచారం అందించాడు.
ఆ వెంటనే డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేశ్, ఇతర సిబ్బంది తొర్రూరు బస్టాండుకు చేరుకుని బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి పీపీఈ కిట్ తొడిగిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడు ఏ బస్సులో ఎక్కాడు? అందులో ఎందరు ప్రయాణించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.