ఇక ఇటీవల భారత దేశంలో కూడా టీకా విడుదల కాబోతోంది లాంటి వార్తలను మనం వింటూ వున్నాం. ఇకపోతే ఇలాంటి తరుణంలో బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాను అందజేస్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ మాత్రం ఇపుడు తీవ్రమైన దుమారాన్ని రేపుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక ప్రకటన వెలువడటం గమనార్హం. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తాజాగా ప్రకటించారు.
ఒడిశాలోని బాలసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ను దేశ ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని అనడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దాదాపు 500 రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసినట్టు ఈ సందర్భంగా చెప్పారు.
ఇకపొతే, కేవలం బిహార్ ఎన్నికల సందర్భంగానే బీజేపీ మేనిఫెస్టోలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇవ్వడంపైన పలు అనుమానాలు వున్నాయి. అలాగే టీకా ఒక్కింటికి 500/- అనేది కూడా అవాస్తవం అని కొందరు రాజకీయ ప్రత్యర్థుల మాట. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు పార్టీలు బీజేపీ హామీపై తీవ్ర స్థాయిలో ధ్యజమెత్తాయి. ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ కూడా ఈ హామీపై పలు విమర్శలు చేయడం కొసమెరుపు.