నటనలోనే కాదు, రాజకీయంగానూ ప్రత్యేకతను సంతరించుకుంటానని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ సంతరించుకున్న ప్రత్యేకత మాటున అధికార పార్టీల భజన చేస్తున్నాడనే విమర్శలను కోకొల్లలుగా మూటగట్టుకుంటున్నాడు. పిల్లి కళ్లు మూసుకున్నంత మాత్రాన పసిగట్టలేరని అనుకోవడం పవన్ అవివేకమే అవుతుంది.`సువ్వి`-అంటే రోకలి పోటని తెలియని అమాయకులు ఏపీ, తెలంగాణాల్లో ఉన్నారని పవన్ అనుకుంటే అది నిజంగా పెద్ద పొరపాటే అవుతుంది. ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ జనసేన పార్టీని స్థాపించడంతో ప్రజలు కొంత రిలాక్స్గా ఫీలయ్యారు. తమకు ఓ చేరువ లభించిందని అనుకున్నారు. అటు తెలంగాణాలో కానీ, ఇటు ఏపీలోకానీ ప్రజలు పవన్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫార్సు చేసినట్టు.. ఏపీలో చంద్రబాబు పాలనకు తెలంగాణలో కేసీఆర్ పాలనకు పవన్ సర్టిఫికెట్లు ఇస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదన్నట్టు బాబు పాలన బాగుందని ఏపీలో.. కేసీఆర్ పర్ ఫెక్టని తెలంగాణలో పవన్ చెప్పడం అసలు ఆయన రాజకీయ పార్టీ పెట్టింది వారిని పొగిడేందుకు, వారిని సమర్ధించేందుకేనా అనే అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఏపీలో గత ఏడాది వరుస మూడు రోజుల పర్యటనలో పవన్ ప్రశ్నించింది ఏమైనా ఉంటే విపక్షాన్ని, విపక్ష అధినేత జగన్ను. అధికారంలో లేని జగన్ను ప్రశ్నించి పవన్ విమర్శలను ఎదుర్కొన్నాడే తప్ప లబ్ధిపొందింది ఏమాత్రమూలేదు. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సంతృప్త స్థాయి పెరిగిపోతోందని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబును ప్రశ్నించలేక పోయాడు పవన్. అవినీతి తామర తంపరలా పెరిగి పోయినబాబు జమానా నైజాన్నీ ఆయన చూసీ చూడనట్టు వదిలివేశాడు. పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం విదేశాలను చట్టి వచ్చేందుకు కోట్ల రూపాయలు తగలేస్తున్న బాబు సర్కారు..
ప్రత్యేక హోదా వస్తే.. అవన్నీ కూర్చున్న చోటకే క్యూకడతాయని తెలిసి కూడా కేంద్రంతో రాజీ పడిపోయిన వైనాన్నీ పవన్ ప్రశ్నించలేక పోతున్నాడు. ఇక, ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. తెలంగాణలో యాత్ర చేపట్టిన పవన్.. ``గాడెవడు`` అని సాక్షాత్తూ... సీఎం కేసీఆర్తో తీవ్ర పదజాలం ఎదుర్కొని కూడా ఇప్పుడు ఆయనను అంబరానికెత్తేస్తున్నారు. బంగారు తెలంగాణ సాధనంటూ.. ఉన్న తెలంగాణను నాశనం చేస్తున్నాడన్న విపక్షాల విమర్శలు పవన్కు వినిపించడం లేదా? కనిపించడం లేదా?! పార్టీ పెట్టింది ఇటు ఏపీలో చంద్రబాబును పొగిడేందుకు, అటు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేందుకేనా? ఇప్పుడు ఈప్రశ్నలు జనాలే పవన్పై సంధిస్తున్నారు. పార్టీ పెట్టగానే సరిపోదు. ప్రజల పక్షాన నిలబడే ధైర్యం ఉండాలి.
ఈ ధైర్యం లేకనే అటు, ఇటు అదికార పక్షాలకు అమాంబాపతు భజన చేయడంలో పవన్ ఆరితేరిపోయాడనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు టీఆర్ ఎస్కు, ఇటు టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారం అక్కర్లేదని చెబుతూ.. సాద్యమైనన్ని సీట్లలో ఓట్లను చీల్చి.. వారికి లబ్ధి చేకూర్చేలా పవన్ వ్యవహరిస్తున్న శైలిని ప్రతి ఒక్కరూ కొంత ఆలస్యంగానైనా అర్ధం చేసుకుంటున్నారనేది విశ్లేషకుల మాట. పవన్ వ్యవహార శైలిపై సర్వత్రా ఇప్పుడు ఇదే తరహా చర్చ సాగుతోంది. తాను పాతికేళ్ల ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పెట్టానన్న పవన్.. ఇలా భజన పరుడుగా మారితే.. పాతికేళ్లు కాదు కదా.. పాతిక నెలలు కూడా ప్రజలు భరించలేరనే నిజాన్ని తెలుసుకుంటే మంచిదని అంటున్నారు.