అమరావతి బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యిందంటూ చంద్రబాబునాయుడుతో సహా అందరూ చంకలు కొట్టుకుంటున్నారు. తమ ప్రభుత్వ ఘనతే అని, తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసంతోనే పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్న విషయం అందరూ ఊస్తున్నదే. బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఓపెన్ చేసిన గంటలోనే ఒవర్ సబ్ స్క్రైబ్ అయిన విషయం తెలిసిందే.
గంటలోనే ఓవర్ సబ్ స్క్రైబ్
అమరావతి రాజధాని నిర్మాణం లక్ష్యంతో ప్రభుత్వం రూ. 1300 కోట్ల సమీకరణ లక్ష్యంతో బాండ్లను జారీ చేస్తే గంటలోనే రూ. 2 వేల కోట్లు వచ్చాయి. దాంతో చంద్రబాబు అండ్ కో తో పాటు టిడిపి మీడియా కూడా ఒకటే ఊదరగొట్టేసింది. ఎవరు ఇవ్వని స్ధాయిలో వడ్డీ రేటు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో పాటు బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటంతోనే బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయని నిపుణులు, ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, ఆ విమర్శలను ప్రభుత్వం కొట్టేసిందనుకోండి అదివేరే సంగతి.
అమరావతికి తక్కువ రేటింగ్
అయితే, తాజాగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పిన మాటలు కూడా ప్రతిపక్షాల విమర్శలకు మద్దతుగానే ఉన్నాయి. ఇంతకీ కుటుంబరావు ఏం చెప్పారంటే, పెట్టుబడిదారులు రాజధాని, సిఆర్డిఏకు తక్కువ రేటింగ్ ఇవ్వటం వల్లే అమరావతి బాండ్లకు అధిక వడ్డీ చెల్లించటానికి అంగీకరించాల్సొచ్చిందన్నారు. బాండ్లు జారీ చేసే సంస్ద తిరిగి డబ్బులు చెల్లించటానికి ఉన్న అవకాశాలను బట్టి పెట్టుబడి సంస్దలు వడ్డీ రేటు నిర్ణయిస్తాయట.
అమరావతికి ఏ ప్లస్ రేటింగే
తిరిగి చెల్లించే అవకాశాలు బాగా ఉంటే మూడు ఏల రేటింగ్ తో తక్కువ వడ్డీ రేటు నిర్ణయిస్తాయట. అవకాశాలు తక్కువుంటే ఏ ప్లస్ రేటింగ్ ఇస్తాయట. ఇపుడు అమరావతికి పెట్టుబడిదారులు ఏ ప్లస్ రేటింగ్ ఇచ్చారట. అంటే తిరిగి చెల్లించే అవకాశాలు తక్కువనేకదా అర్ధం. అందుకనే పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా ఎక్కువ వడ్డీ ఇస్తామని ఒప్పుకుంది. ఎలాగూ అధికవడ్డీ ఆఫర్ చేస్తోంది కాబట్టే బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయనేది అర్ధమైపోతోంది.