ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తన ఆందోళనను నిరసన రూపం దాల్చారు. తమ విద్యాసంస్థకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పది వేల మంది విద్యార్థులతో కలిసి మోహన్బాబు, విష్ణు, మనోజ్లు నిరసన ర్యాలీ చేపట్టారు.తిరుపతి లీలామహల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో తిరుపతిలో వాతావరణం వేడెక్కింది.
శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్బాబు తిరుపతిలో నిరసనకు దిగారు. మోహన్బాబు నిరసనకు దిగనున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈక్రమంలో మోహన్బాబు తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే మోహన్ బాబు తన విద్యాసంస్థలతో చెందిన విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలాఉండగా, ఈ ఆందోళనపై సినీనటుడు శివాజీ స్పందించారు. ఎన్నికల సమయంలోనే మోహన్బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు.