ఏపీ మంత్రి గుమ్మనూర్ జయరామ్ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఆయనపై చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించారు అట.
2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు తన పార్టీ వీక్గా ఉన్న జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను భారీ ప్రలోభాలతో తమ పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాపై టార్గెట్ పెట్టిన చంద్రబాబు భూమా ఫ్యామిలీ నుంచే ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. వీరితో పాటు అప్పుడు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా బాబు ఆపరేషన్ అస్త్రం వాడారు.
ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన గుమ్మూరు జయరాంకు కూడా బాబు ప్రలోభాల ఎరవేశారట. గతంలో చంద్రబాబు టీడీపీలోకి వస్తే రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. తాను డబ్బుకు అమ్ముడు పోయే వ్యక్తిని కాదని... తాను నిజాయితీతో ఉన్నానని.. జగన్నే నమ్ముకున్నానని అందుకే ఈ రోజు తనకు జగన్మోహన్రెడ్డి మంత్రి పదవి ఇచ్చారని జయరామ్ చెప్పారు.
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి వాళ్లు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిపోతే తాను మాత్రం చేరలేదని మంత్రి జయరామ్ చెప్పుకొచ్చారు. ఇక జయరామ్ బీసీల్లో బోయ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన ఈ ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మను భారీ మెజార్టీతో ఓడించారు. ఏదేమైనా చంద్రబాబు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎంత ఎత్తున ప్రలోభ పెట్టారో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.