డ్వాక్రా రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు జిల్లాల వారీగా వివరాలు గడువులోగా సమర్పించాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆ మేరకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది జాబితా సేకరణలో నిమగ్నమవుతున్నారు.
సదరు రుణాలు మాఫీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సభ్యులు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయడానికి ఆయన సముఖత వ్యక్తం చేశారు. సకాలంలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపితే ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
జిల్లాలో పొదుపు మహిళలు, రుణం తీసుకున్న సభ్యులు, అప్పు ఉన్న వారి వివరాలు పంపాలని సెర్ఫ్ నుంచి డీఆర్డీఏ కార్యాలయానికి ఆదేశాలందాయి. ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 తేదీ నాటికి సంఘాలకు చెందిన రుణాలు, అప్పుల బకాయిలపై పూర్తి వివరాలను అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సభ్యులు తిరిగి చెల్లించాలి. ఆపై ప్రభుత్వం రుణమాఫీ నగదును సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. అంతేతప్ప సభ్యులు మాఫీ అయ్యిందని తిరిగి చెల్లించకుంటే వారి ఖాతాల్లో నగదు జమ కాదు. సీఎం జగన్ చేసిన ప్రకటనపై పొదుపు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.