రాష్ట్రంలో ఇకపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యార్ధులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామంటూ వైసీపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై ప్రస్తుతం గందరగోళం నెలకుని ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్‌ మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

 

ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు లక్షమందికి పైగా విద్యార్ధులు ఈ వారం రోజుల్లో వెళ్లనున్నారు. వీరిలో 10వేల ర్యాంకు లోపు వారికి ఎటువంటి సమస్య లేదు.. అయితే ఆపై వచ్చిన ర్యాంకుల వారు గందరగోళంలో ఉన్నారు.. కారణం ఏ గ్రేడ్‌ కాలేజీలకు ప్రస్తుత ప్రభుత్వం రూ.లక్షా 20వేలు ఫీజుగా నిర్ణయించింది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.45వేలు మాత్రమే ఇస్తామంటూ అధికారులు కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద చెబుతున్నారు. దీంతో పేద విద్యార్ధులు లక్షా 20వేలలో 45వేలు పోను రూ.75 వేలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నారు.

 

ఫీజులు కట్టుకోలేని కుటుంబాలు వారికి ప్రభుత్వం ఇచ్చే 45వేలతో వచ్చే కాలేజీలోనే అడ్మిషన్లు పొందుతున్నారు. దీంతో ప్రతిభ ఉండి కూడా పేద విద్యార్థులు నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యకు దూరంగా ఉంటున్నారు. అదే ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తే పేద విద్యార్ధులు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని నాణ్యమైన కళాశాలల్లోనే సీటు పొందే అవకావం ఉంటుంది. ప్రభుత్వం నేటినుంచి ఆలస్యం చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు.

 

మొదటి కౌన్సెలింగ్‌లోనే ఎక్కువమంది విద్యార్ధులు వాటిలో సీట్లు పొందే పరిస్థితి ఉంటుంది. దీంతో అవకాశం ఉండి కూడా కోల్పోయిన నిరుపేద విద్యార్థులు నాలుగేళ్ళ పాటు నాణ్యత లేని కళాశాలలోనే చదవాల్సి ఉండడమే కాకుండా భవిష్యత్తు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రకటించినా వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. అందు వల్ల ప్రభుత్వం జాప్యం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేసి నిరుపేద విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిందిగా తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: